Sep 06,2022 23:35

ఆశాలకు కనీస వేతనం ఇవ్వాలి
20న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
ప్రజాశక్తి- పుంగనూరు:
ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రూప్‌ఇన్సూరెన్సు, కోవిడ్‌లో మరణించిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య డిమాండ్‌ చేశారు. మంగళవారం పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశ వర్కర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా చైతన్య మాట్లాడుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట జరుగు కార్మికుల ధర్నాలో ఆశాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 44వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సూచించిన ప్రకారం ఆశయాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు, సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఆందోళన చేయడం తప్పా వేరే మార్గం లేదని అన్నారు. ఆశాలు అభద్రతలో పనిచేస్తున్నారని, ప్రభుత్వం కనీసం రక్షణ పరికారాలు కూడా ఇవ్వడం లేదని, అంతేకాకుండా సెలవులు, మెడికల్‌ లీవులు, మెటర్నటీ సౌకర్యం లేదని విమర్శించారు. ఆశాలు భవిష్యత్తు పోరాటాలకు సిద్దం ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆయా పీహెచ్సీల ఆశాలు తలక్ష్మీదేవి, అలివెలు, అనురాధ, సుజాత, సావిత్రి, మధుమతి, అమరావతి, సీఐటీయూ మండలనాయకులు వై.ధనలక్ష్మి, రంజిత్‌ కుమార్‌లు పాల్గొన్నారు.