Oct 08,2023 00:52

నర్సీపట్నంలో నినాదాలు చేస్తున్నఆశాలు

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్‌ : రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల అవలంబిస్తున్న దుర్మార్గ వైఖరిని ఖండిస్తూ ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన శనివారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. తమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, గుంటూరు జిల్లా కార్యదర్శి లక్ష్మి, ఇతర ఆశా కార్యకర్తలను, సిఐటియు నాయకులను శుక్రవారం రాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారని, శనివారం ఉదయం వారిని అక్కడి నుంచి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారని, ఆ చర్య అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ధర్నాలో సంఘం విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి.మణి మాట్లాడుతూ మరణించిన ఆశా వర్కర్‌ కృపమ్మ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కృపమ్మ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో ప్రకటన వస్తుందని నమ్మబలికిన అధికారులు అందుకు విరుద్ధంగా సిఐటియు నాయకులను, ఆశా కార్యకర్తలను మరోసారి అరెస్టు చేయడం దారుణమన్నారు. నిత్యం దళితుల గురించి, మహిళలు గురించి గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో ఇంత సిగ్గుమాలిన విధంగా వ్యవహరించడం మహిళా లోకాన్ని నివ్వెర పరుస్తోందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం పేరుతో ఆశా వర్కర్లకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారన్నారు. దీని మూలంగా చిత్తూరు జిల్లాలో జానకి అనే ఆశా వర్కర్‌ నాలుగు రోజుల క్రితం మృతి చెందిందన్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో కృపమ్మ చనిపోయిందన్నారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనన్నారు. చనిపోయిన ఆశాల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు, ఇళ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆశాలపై అధికారుల వేధింపులు ఆపాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.పద్మ, కార్యదర్శి వి.మేరీ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో విధి నిర్వహణలో ఉంటూ అకస్మాత్తుగా మరణించిన తాడేపల్లి అర్బన్‌ పిహెచ్‌సి ఆశా కార్యకర్త రేవూరి కృపమ్మ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ శనివారం స్థానిక నర్సింగరావుపేట అర్బన్‌ హెల్త్‌ సెంటర్లో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కోశాధికారి డి.సూర్య, నాయకులు రమణమ్మ, విజయ తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌:ఆశా కార్యకర్త మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిఐటియు డిమాండ్‌ చేసింది. శనివారం మండలంలో వేములపూడి పీహెచ్‌సీ వద్ద ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల యూనియన్‌ సభ్యులు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో విదులు నిర్వహిస్తూ తీవ్ర ఒత్తిడి కారణంగా అకస్మాత్తుగా రేపూడి కృపమ్మ మృతి చెందిందని, దీనికీ ప్రభుత్వమే పూర్తి భాద్యత వహించాలని డిమాండ్‌ చేశారు. అ కుటుంబానికి 50లక్షల పరిహరం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల అమ్మాజి, నాగమణి, లక్ష్మీ కాంతం, లక్ష్మీ పాల్గొన్నారు.