
ప్రజాశక్తి-పల్నాడుజిల్లా : నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక దేశం అప్పులు రూ.100 లక్షల కోట్లు పైబడి పెంచారని, ఆ నిధుల నుండి ఆంధ్రరపదేశ్ అభివృద్ధికి కేటాయింపులు మాత్రం నామమాత్రమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య విమర్శించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులో పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశానికి సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ అధ్యక్షత వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ బిజెపి పాలనలో పరిశ్రమలు, వ్యవసాయం, విద్య తదితర రంగాలు కుదేలవుతున్నాయని, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మతోన్మాద బిజెపికి రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన అడుగడునా మద్దతు తెలుపుతున్నాయని, ఆ పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ అంశాలపై ప్రజా రక్షణ భేరి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రకటనతో సాగర్ ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలేశారని, వాటికీ నీరివ్వకపోవడంతో ఎండిపోయే దశలో పైర్లున్నాయని తెలిపారు. సాగునీటిని తక్షణమే విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు.
గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలలో ఎండగడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి సిపిఎం విధానాలను ప్రజలకు వివరిస్తూ ఈనెల 30న కర్నూలులో బయలుదేరే ప్రజా రక్షణ భేరీ బస్సు యాత్ర 7న పల్నాడు జిల్లాకు చేరుకుంటుందని తెలిపారు. యాత్రకు ఘన స్వాగతం పలకడంతో పాటు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద, సత్తెనపల్లి, 8న చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కాపాడుకోవడం అందరి హక్కు అనే నినాదంతో కార్మికులు చేస్తున్న పోరాటానికి సిపిఎం పూర్తి సంఘీభావం తెలుపుతుందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని నిలిపిన ఘనత వైసిపికి దక్కుతుందన్నారు. రాజధాని అమరావతిగా ప్రకటించి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు రాబట్టేందుకు అవసరమైతే అఖిలపక్షాల సహాయం తీసుకోవాలని సూచించారు. విశాఖ రైల్వే జోన్, ఓడరేవుల అభివృద్ధి మరియు ప్రభుత్వ రంగ పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం సిపిఎం దశలవారీగా పోరాటం సాగిస్తోందన్నారు. కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేలా ఉన్న జిందాల్ సంస్థకు అప్పజెప్పిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు సాగునీరు అందించాలని, లేదా పంట నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. పనుల్లేక అర్థాకలితో అలమటిస్తున్న గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజుల పని దినాలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రానికి రావలసిన 11 యూనివర్సిటీలను రాబట్టేందుకు ప్రభుత్వం కృషి చేయాలని, ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజారక్షణ భేరి పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, ఏపూరి గోపాలరావు, ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, జి.రవిబాబు, నాయకులు డి.శివకుమారి, ఫాతిమా, సిలార్ మసూద్, రబ్బాని, హుస్సేన్, సుభాని, కె.సాయి కుమార్, ఆంజనేయరాజు పాల్గొన్నారు.