
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - లావేరు: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కోరారు. మండలంలోని గోవిందపురం పంచాయతీ పరిధిలోని ఇజ్జాడపాలెంలో మంగళవారం నిర్వహించిన ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఐసిడిఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య శిబిరంలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఏ సేవలు అందజేస్తున్నామన్న వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రోగుల ఒపి సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సురక్షలో అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలను ఆరోగ్యవంతులని చేయడమే లక్ష్యమన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదికల ఆధారంగా రోగులకు చికిత్స అందించడమే కాకుండా ఇంకా ఏవైనా వ్యాధులు ఉంటే మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేయనున్నామని చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక ఆహ్వానితులు రొక్కం బాలకృష్ణ, జెడ్పిటిసి మీసాల సీతంనాయుడు, ఎంపిడిఒ కె.సురేష్ కుమార్, సర్పంచ్ పి.రాము, జెసిఎస్ ఇన్ఛార్జి మీసాల శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు