
క్షయ వ్యాధిని నిర్ధారించడానికి రోగి కళ్ళెని పరీక్షిస్తే చాలు. కానీ ప్రయివేటు ఆస్పత్రులలో చాలా ఖరీదైన టిబి గోల్డ్, టిబి ప్లాటినం పరీక్షలు రాస్తున్నారు. జ్వరం వచ్చిన ఐదోరోజు కంటే ముందు రక్త పరీక్షలు చేయించినా టైఫాయిడ్ని నిర్ధారించలేము. కానీ రోజు మార్చి రోజు రక్తపరీక్షలు చేయిస్తున్నారు. ఎంత ఖరీదైన పరీక్ష రాస్తే అంత కమిషన్ వస్తుంది. ఇంకో కొత్తపరీక్ష ఉంది. దాని పేరు ''సింక్ పరీక్ష''. అంటే సేకరించిన నమూనాలను పరీక్షించకుండానే సింకులో పడేస్తారు. అంతా బాగానే ఉందని డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు ఆయన కమిషన్ వచ్చేస్తుంది.
కార్పొరేట్ ఆస్పత్రిలో ఒకరోగికి ఏదో అవసరం కోసం పొట్ట భాగంలో ఆల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహించేటప్పుడు గాల్ బ్లాడర్లో రాయి కనిపించింది. దానివల్ల రోగికి ఏ బాధా లేదు. అయినా సరే రోగిని భయపెట్టి, హెర్నియా ఆపరేషన్ చేసి లక్షన్నర రూపాయలు వసూలు చేశారు. హాస్పటల్ ప్రారంభించేటప్పుడే దాని యజమాని డయాగ్నోస్టిక్ సెంటర్, మందుల షాపుకి స్థలం కేటాయించి వాటిని నడిపేవారి దగ్గర్నుంచి 75 లక్షల రూపాయల వరకూ డిపాజిట్ కట్టించుకుంటాడు. ఆస్పత్రి నిర్మాణానికి అప్పు సమస్య ఉండదు.
డెంగ్యూ వ్యాధే కాదు ఎలాంటి వైరల్ జ్వరం వచ్చినా ప్లేట్ లెట్ల రేట్ల సంఖ్య పడిపోతుంది. అలాంటి వెయ్యిమందిలో ఒక్కరు మాత్రమే హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది. మిగతా వారందరికీ కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలూ, మందులతో సరిపోతుంది. కానీ చాలామంది డాక్టర్లు రోగులను భయపెట్టి ఆస్పత్రిలో చేర్చుకుని సెలైన్ బాటిల్ తగిలించేస్తున్నారు. సాధారణ ప్రసవానికి కూడా 'ప్రొజెస్టెరాన్' అనే మందు వాడుతున్నారు. వైద్య శాస్త్రం దీన్నంగీకరించదు. బీ కాంప్లెక్, సి విటమిన్ల వలే శరీరంలో అదనంగా ఉన్న డీ విటమిన్ మూత్రం ద్వారా పోకుండా శరీరంలో పేరుకుపోతుంది. కాబట్టి దీర్ఘకాలం డీ విటమిన్ మాత్రలు వాడితే క్యాన్సర్కి దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
షాపింగ్ మాల్ సంస్కృతి మాస్టర్ హెల్త్ చెకప్ పేరుతో తక్కువ రేటుకి ఎక్కువ టెస్టులు చేస్తున్నారు. అర్థం చేసుకోవలసిందేమిటంటే వాటిలో చాలావరకూ అవసరం లేనివే.
డాక్టర్లకు టార్గెట్ ఓపిలో చూసిన రోగుల్లో 40 శాతం మందిని హాస్పిటల్లో జాయిన్ చెయ్యకపోతే ఆ డాక్టర్ ఉద్యోగం పోతుంది.
''నేను మీ కంపెనీ మందులు రాస్తాను. నన్ను యూరప్ టూర్కి పంపించాలి''- అని డిమాండ్ చేసే డాక్టర్లున్నారు.
శవాలతో వ్యాపారం ఏ ఆస్పత్రిలో అయినా ఒక రోగి మరణిస్తే శవాన్ని పోస్టుమార్టం కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి పంపిస్తారు. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమి రాయాలి? అనేదానిపై బేరసారాలు జరుగుతాయి.
మన వైద్య వ్యవస్థ గురించి 78 మంది వైద్యులతో చర్చించి రాసిన పుస్తకం ''వైద్యానికి సుస్తీ''. ఈ కరోనా సమయంలో దీన్ని ద్వితీయ ముద్రణ చేశారు.
సామెత చెప్పినట్టు 'ఇంట్లో లేకపోవడమే ఒంట్లో జబ్బుకి కారణం' అయిన పరిస్థితుల్లో అధికశాతం ప్రజలున్నపుడు, ఎంతమంది తమకు అన్యాయం జరిగినపుడు ఇందులో చెప్పినట్టు ఆచరించగలరు? అనే సందేహం సహజమే! అయినా ఇందులోని విషయాలు ఉపయోగకరమే! పరిమితిని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాసం చదవండి.
ప్రయివేట్ హాస్పిటల్లో ఒక మహిళారోగికి ఒక ఇంజెక్షన్కి తొమ్మిది వేల రూపాయలవుతుందని చెప్పి డిశ్చార్జ్ సమయంలో ఒక్కో ఇంజెక్షన్కి 18,990 రూపాయల బిల్ వేశారు. ఆ మహిళ భర్త వినియోగదారుల ఫోరంని ఆశ్రయించి, న్యాయం పొందాడు. జైపూర్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో జరిగిన సంఘటన.(పే 126)
15 ఇంజెక్షన్ల ధర ఆస్పత్రి మెడికల్ షాపులో లక్షా యాభైవేల రూపాయలు. అవే ఇంజెక్షన్లు బయటి షాపులో కొంటే తొంబైవేల రూపాయలు. తమ హాస్పిటల్లోనే కొనాలని ఆస్పత్రి కండిషన్. రోగి బంధువులకు గత్యంతరం లేక ఆస్పత్రి షాపులోనే కొని, చికిత్స పూర్తయ్యాక వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. 2009 జనవరిలో పూనాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగిన సంఘటన ఇది. (పే 126)
డయాగ్నోస్టిక్ సెంటర్లు, మందులషాపులను ఎంపిక చేసుకునే హక్కు రోగికి ఉంది. అది తెలుసుకోవాలి.
ఈ పుస్తకం మొదటిభాగంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న అవకతవకలు, మందుల కంపెనీల మాయాజాలం, వైద్యసేవలు వ్యాపారమయం కావడం గురించి తెలుసుకున్నాం.
నాణానికి రెండోవైపు కూడా ఉంటుంది. అన్ని రంగాల్లోనూ ఉన్నట్టే వైద్యరంగంలోనూ మెజారిటీ ప్రజల శ్రేయస్సుకోరే డాక్టర్లు కూడా ఉంటారు కదా! రెండో భాగంలో అలాంటి డాక్టర్లు సూచించిన పరిష్కారాలు ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సపొందే రోగులకు పైన చెప్పిన హక్కులవంటివి కూడా ఉన్నాయి. వాటిని ఈ పుస్తక రచయిత తన అనుభవంలోని ఇలాంటి ఉదాహరణలతో సహా చెప్పారు. ఇంకా వైద్యరంగంలో గూగుల్ నిర్వహిస్తున్న పాత్ర, ప్రైవేటు వైద్యరంగాన్ని నియంత్రించడానికి సూచనలు(10వ అధ్యాయం) సార్వత్రిక ఆరోగ్య రక్షణవ్యవస్థ ఆవశ్యకత (11వ అధ్యాయం) వివరించారు.
వాటిపై ఓ విహంగ వీక్షణ
బ్రాండెడ్ మందుల స్థానంలో నాణ్యమైన జనరిక్ మందులు తక్కువధరకు ప్రజలకు అందుబాటులోకి రావాలి. ప్రైవేట్ వైద్యరంగంపై నియంత్రణలు విధించి, వాటిని అమలుపరిచే యంత్రాంగాన్ని తక్షణమే రూపొందించాలి. వివిధ చికిత్సా విధానాల గురించి ప్రజలలో అవగాహన పెంచే కృషి జరగాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపొందే రోగులకు ఉన్న హక్కులను గుర్తించి, వైద్యులు నిర్లక్ష్యం వహించారని భావిస్తే వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేయవచ్చు. వైద్యుల నైతిక ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన 'భారతీయ వైద్యమండలి' దేవతావస్త్రం అయిపోయింది. సుప్రీం కోర్టు ఆదేశాలప్రకారం ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర చికిత్సను డబ్బులతో ముడిపెట్టడం నేరం (ఉదాహరణ పే119), చికిత్స ధరల వివరాలు ఆస్పత్రి నుంచి పొందే హక్కు ఉంది. మెడికల్ రిపోర్టులు పొందే హక్కు రోగికి ఉంది. (దీనివల్ల కలిగే ప్రయోజనాలు పే 122) రెండో అభిప్రాయాన్ని (మొదటి వైద్యునితో చర్చించి) తీసుకునే హక్కు. రోగులు అందించిన వ్యక్తిగత విషయాలను వైద్యుడు బహిర్గతం చేయకూడదు (పే 124) వ్యాధినిర్ధారణ పరీక్షల్లోని ప్రమాదాలు, ప్రత్యామ్నాయాలు తెలుసుకునే హక్కు. ఆస్పత్రి బిల్లు పూర్తిగా చెల్లించకపోయినా రోగిని డిశ్చార్జ్ చేయించుకునే హక్కు, మృతదేహాన్ని తీసుకునే హక్కు( పే 129).
నైతిక విలువలు గల వైద్యులను గుర్తించడానికి కొన్ని సూచనలు 1.రోగులు అడిగిన సహేతుకమైన ప్రశ్నలకు విసుగుచెందరు. 2. రోగులకు, వారి కుటుంబ సభ్యులకు చికిత్స వివరాలను అందిస్తారు. 3. వివిధ చికిత్సా పద్ధతులను, వాటి మంచి చెడులను తెలిపి, తగిన నిర్ణయం తీసుకోవడానికి సహకరిస్తారు. 4. ఖరీదైన పరీక్షలు చేయించాల్సి వస్తే తగిన కారణాలను వివరిస్తారు. 5. మంచి వైద్యులు తమకు అన్నీ తెలుసని చెప్పుకోరు. సరైన నిర్ధారణకు రాలేకపోతే ఆ విషయం ఒప్పుకుంటారు.(పే 137) 6. మంచి వైద్యులు రిస్క్ తీసుకోడానికి సిద్ధంగా ఉంటారు. రిస్క్ తీసుకోకుండా తాము క్షేమంగా ఉంటే చాలనుకునే వైద్యులు రోగి ప్రాణాలను కాపాడలేకపోవచ్చు. (ఉదా.141)
ఇంటర్నెటోసిస్ వైద్యుల పట్లా, వైద్యం పట్లా మారుతున్న సమాజ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ప్రపంచంలోని సమాచారాన్ని గూగుల్ మన ముందుకు తెచ్చిన మాట నిజమే. కానీ అదంతా కచ్చితమైనదనీ, రోగి అవసరాలకు తగినదేననీ చెప్పలేమనీ, అలా ఇంటర్నెట్ సాయంతో తమ చికిత్స గురించి ఒక నిర్ణయానికి రావడాన్ని ''ఇంటర్నెటోసిస్'' అంటారనీ వివరించారు. (పే.142,143)
వైద్యుడు - రోగి సంబంధాలు నాలుగురకాలుగా ఉంటాయట. (పే.143-146)
భారతీయ వైద్యమండలి పనితీరు వైద్యుల నైతిక ప్రవర్తన పర్యవేక్షణ కోసం ఏర్పడిన ఈ మండలి మహారాష్ట్ర కౌన్సిల్కి 2005-2015 కాలంలో 746 ఫిర్యాదులు అందితే కేవలం 151 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయట.
చిన్న ఆస్పత్రులను పోట ీనుంచి తప్పించడానికి పన్నే కుట్రలు. ఒక ఉదా: ఆస్పత్రులన్నీ తమ భవనాలకు సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ చేయించాలనే నిబంధన పెడితే చిన్నాస్పత్రులు చేతులెత్తేస్తాయి.
సుమారు 78 మంది డాక్టర్లను ఇంటర్వ్యూ చేసి, ప్రైవేటు హాస్పిటళ్ళలో జరిగే అవకతవకలను వెలుగులోకి తెచ్చిన ఈ పుస్తక రచయితలు డా.అరుణ్ గాద్రే, డా.అభరు శుక్లాలు అభినందనీయులు. సామాన్య జనానికి కూడా అర్థమయ్యేంత సరళంగా తెలుగు చేసిన డా.ఎస్.సురేష్కి తెలుగుపాఠకుల తరపున ధన్యవాదాలు. కోవిడ్ మహమ్మారి విజృంభణలో వైద్యరంగంపై విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ''వైద్యానికి సుస్తీ'' వంటి పుస్తకాన్ని చదివి చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
పుస్తకం పేరు : వైద్యానికి సుస్తీ
పేజీలు : 184
వెల : 200/-
ద్వితీయముద్రణ : జూన్, 2021
లభ్యం : ప్రజాశక్తి బుకహేౌస్ అన్ని బ్రాంచిలు
- ప్రకాష్