ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్ : గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుటకు భారత ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం 2006 తీసుకురావడం జరిగిందని, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె.అబ్సలోమ్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం, పెద్దపంజాని, సోమల మండల పరిధిలోని పెద్దకాపులపల్లి, పేటూరు పంచాయతీకి సంబంధించి ముచ్చుకాల్వ గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి అధ్యక్షతన అటవీ హక్కుల చట్టం 2006, గ్రామ కమిటీ ఎన్నికపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికంగా, సామా జికంగా అభివృద్ధి చెందడానికి జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ ఆదేశాల మేరకు జిల్లాలోని గిరిజన గ్రామాలలో అర్హులైన గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసేందుకు గిరిజన గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగు తుందని తెలిపారు. అనంతరం పెద్దపంజాని మండలం, పెద్దకాపుల పల్లి పంచాయతీ, సోమల మండలం, పేటూరు పంచాయతీకి సంబంధించి ముచ్చుకాల్వ గ్రామంలో అటవీ హక్కుల చట్టం 2006 గ్రామ కమిటీని గ్రామస్తులు, ఛైర్మన్గా ఈ.రాజశేఖర్ను, సెక్రటరీగా పి.ఉమాపతిలతో 13 మంది సభ్యుల గాను, ఎన్నుకున్నారు. రెండు పంచాయతీలకు సంబంధించి 29 మంది అటవీ భూమిలో సాగు చేసుకుంటున్నామని దరఖాస్తులు అందజేశారు. ఈ దరఖాస్తులు గ్రామ అటవీ హక్కుల చట్టం కమిటీ సభ్యులు పరిశీలించి, సబ్ డివిజనకు పంపడం జరుగుతుందని, సబ్ డివిజన్ కమిటీ పరిశీలించిన తర్వాత జిల్లా స్థాయి కమిటీకి పంపడం జరుగుతుందని, జిల్లా కమిటీ పరిశీలించిన తర్వాత అర్హులైన గిరిజన రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందజేయడం జరుగు తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ గిరిజన సంక్షేమ శాఖ అధికారి, మూర్తి, జె ఏ.మురళి, అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ హరి కుమార్, పేటూరు పెద్దకాపుపల్లి పంచాయతీ సెక్రటరీలు ఎస్.లలిత, విశ్వమాల, వి ఆర్ ఓలు ,ఏ.మురళి, శ్రీనివాసులు, సర్వేయర్ లీలా కుమార్, సర్పంచులు విమలమ్మ, చంద్రమోహన్, ఎంపిటిసి సర్వేశ్వరి, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.










