
ప్రజాశక్తి -కోటవురట్ల:అర్హులైన గిరిజనులకు త్వరితగతిన భూ పట్టాలు అందజేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకట జయరాం ఆదేశించారు. శుక్రవారం ఆయన మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి గిరిజనులకు పంపిణీ చేయాల్సిన భూపత్రాలపై ఆరా తీశారు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి అందజేయాలని సూచించారు. కార్యాలయంలో బూత్ లెవిల్ అధికారులు చేపడుతున్న విధుల పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫారం 6,7 వివరాలపై పోలీసు అధికారులు సమాచారం సేకరించారా అని ఆరా తీశారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, మూడవ విడత రీ సర్వే చేపడుతున్నామని ప్రస్తుతం 88 గ్రామాల్లో ఈ సర్వే జరుగుతున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ జరుగుతుందని, ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల అయినట్లు తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇంతవరకు 1250 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. అసైన్డ్ భూముల పూర్తిస్థాయి భూహక్కు రైతుల ఎంపికపై స్థానిక విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ, అసైన్డ్ భూమి వ్యవహారానికి సంబంధించి వారసులకు మాత్రమే హక్కు కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 4582 ఎకరాల అసైన్డ్ భూములు గుర్తించామని, పందూరు, కైలాస పట్నం, పీకేపల్లి, బోడపాలెం, చౌడవాడ, గ్రామాలలో అత్యధికంగా ఉన్నట్లు తెలిపారు. పందూరు గ్రామంలో జోగిపాలెం దళితులకు పునరావాసం కల్పిస్తూ గతంలో కేటాయించిన భూమిపై అందిన ఫిర్యాదుల పట్ల విచారణ చేపట్టామని సమగ్ర విచారణ చేపట్టి జిల్లా స్థాయి అధికారులకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జానకమ్మ, సీనియర్ అసిస్టెంట్ గణపతిరావు, ఆర్ఐ వూర్ధవరావు పాల్గొన్నారు.