ప్రజాశక్తి-ఉండి : పశువులలో వచ్చే వివిధ రకాల వ్యాధులను నిర్ధారించడానికి పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను రైతులందరూ ఉపయోగించుకోవాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కోరారు. ఉండి నియోజకవర్గ స్థాయిలో ఉండి ప్రాంతీయ పశు వైద్యశాలలో నిర్మించిన పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను శనివారం ఉండి శాసనసభ్యులు మంతెన రామరాజు ప్రారంభించి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంతెన రామరాజు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వం తమ హయాములో పలు రకాల ప్రయోగశాలలను ప్రారంభించడం అభినందనీయమని కానీ వాటిని సక్రమంగా కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అధికారుల పైన ఉందని అన్నారు ఎంతో పేరుగాంచిన ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలోని మత్స్య పరిశోధన స్థానంలో ఏడు కోట్ల రూపాయలతో వివిధ రకాల ప్రయోగశాలలను ప్రారంభించడం జరిగిందని కానీ తర్వాత కాలంలో ఆ ప్రయోగశాలను కొనసాగించడంలో అధికారులు ప్రభుత్వం విఫలమవడంతో కోట్ల రూపాయలు విలువచేసే పరికరాలు నిరుపయోగంగా మారిపోయాయని అన్నారు. గత ప్రభుత్వం హయాములో ఉండి లో పశువైద్యశాల నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ నేటికీ దాని నిర్మాణం పూర్తి కాలేదు అన్నారు. అనంతరం జిల్లా పశు సంవర్ధక శాఖ ఉపసంచాలకులు జావర్ హుస్సేన్ మాట్లాడుతూ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలో గతంలో జిల్లా కేంద్రంలోనే ఉండేవని కానీ నేడు ప్రతి నియోజకవర్గంలోనూ ఒక పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఉండాలనే ఉద్దేశంతో నియోజకవర్గ కేంద్రం ఉండిలో డాక్టర్ వైయస్సార్ నియోజకవర్గస్థాయి పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఇందులో సుమారు 10 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందని వీటిని నియోజకవర్గంలోని పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో సుమారు 30 వేల వరకు పశువులు ఉన్నాయని వాటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు కొన్నింటిని 2021 లోనే ప్రారంభించామని శనివారం నుంచి పూర్తిస్థాయిలో ఈ ప్రయోగశాల అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, జడ్పిటిసి రణస్థుల కనకదుర్గ మహంకాళి, గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ, నాయకులు కరిమెరక నాగరాజు, జుత్తిగ శ్రీనివాస్, కిన్నెర వెంకన్న, గురుగుబిల్లి సత్యనారాయణ, చెన్నంశెట్టి హరినాయుడు, కునుకు శ్రీనివాస్, కాగిత బుజ్జి, పోలుబోతు రాము, పశు వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- పశు వైద్యాధికారులతో ఎంపీటీసీలు వాగ్వాదం....
నియోజకవర్గ స్థాయిలో పశువ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని ఉండి గ్రామంలో ప్రారంభించగా అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ఉండి1, ఉండి 2 ఎంపీటీసీలను కార్యక్రమానికి ఆహ్వానించలేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే మంతెన రామరాజు జోక్యం చేసుకుని ఎంపీటీసీలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.










