అనంతపురం రూరల్ సబ్రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎసిబి అధికారులు
అనంతపురం : అనంతపురం రూరల్ మండలం పరిధిలోని రూరల్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నుంచి అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతపురం ఎసిబి డీఎస్పీ శివరామకృష్ణ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. రాత్రి వరకు ఈ సోదాల్లో సుమారు రూ.2.27 లక్షలు అనధికారిక డబ్బు ఉన్నట్టు గుర్తించారు. సబ్ రిజిష్టర్ మహమ్మద్ అలీతోపాటు, డ్రైవర్ మహమ్మద్ ఇస్త్మాయిల్ ఇద్దరి వద్ద కలిపి ఈ మొత్తం ఉన్నట్టు గుర్తించారు. ప్రతి పనికీ ఇంత రేటు అని నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు సోదాల్లో తేలినట్టు సమాచారం. సోదాలు పూర్తయిన తరువాత పూర్తి సమాచారం అందజేయడంతోపాటు, ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్టు డీఎస్పీ శివరామకృష్ణ తెలిపారు.










