ప్రజాశక్తి-అనంతపురం అనంత వేదికగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న జిల్లా ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందించారు. శ్రీ జి ప్రకృతి ధర్మపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ప్రముఖ క్రీడాకారుడు పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ దివాకర్రెడ్డి, డిఎస్పి హనుమంతు, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, ఆదరణ రామకృష్ణ తదితరులు ఆత్మీయ అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అనంత జిల్లాను కరువు బారి నుండి రక్షించుకోవాలంటే విరివిగా చెట్లను పెంచాలని సూచించారు. ప్రతి ఇంట మొక్కలు నాటి వాటిని రక్షించుకుంటేనే భవిష్యత్ తరాల వారికి అందమైన భవిత ఉంటుందన్నారు. అనంతరం సాహిత్య భారతి కార్యదర్శి సుంకర రమేష్, సీనియర్ న్యాయవాది పద్మజ, బ్రహ్మకుమారి సిస్టర్ శారద, బిఎస్ఎన్ఎల్ రాజశేఖర్రెడ్డి, నెహ్రూ యువ కేంద్రం శ్రీనివాస్ తదితరులకు ఉగాది పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రకృతి ధర్మపీఠం నిర్వాహకులు వెంకటేష్, ఆదిరెడ్డి పరదేశినాయుడు, రియాజుద్దీన్, సఫారే రాజశేఖర్, కరణం హరికిషోర్, గాజుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.










