Mar 26,2022 00:00

అరెస్ట్‌ వివరాలను తెలుపుతున్న పోలీసులు


ముద్దాయి అరెస్టు
ప్రజాశక్తి-తిరుపతి సిటి:
స్థానిక అలిపిరి పోలీసు స్టేషన్‌ వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 'శ్రీపాద' అపార్టుమెంట్‌ వద్ద శుక్రవారం నిందితుని అరెస్టు చేసి నాలుగు కంప్యూటర్లు, రెండు సెల్‌ఫోన్లు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొడాలి ప్రతాప్‌ కుమార్‌(53) ఎన్జీవోస్‌ కాలనీలో నివాసముంటున్నట్లు విచారణలో వెల్లడయింది. అతడు అతని భార్య శ్రీదేవి, కుమార్తెలు జాహ్నవి, బందలు కలిసి మోసపూరితమైన కుట్రతో 2019లో ఐటిఎఫ్‌ఎక్స్‌ కంపెనీ హెడ్‌ ఆఫీస్‌ హైదరాబాద్‌లో ప్రారంభించారు. తర్వాత చెన్నై, బెంగళూరు, విజయవాడ, మదనపల్లి, పుంగనూరు తదితర ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి 2020 సంవత్సరం తిరుపతిలో మరొక్క బ్రాంచ్‌ ఏర్పాటు చేశారు. ఆ ఆఫీస్‌లో మహిళలను ఉద్యోగులుగా చేర్చుకొని వారందరికి ఐటిఎఫ్‌ఎక్స్‌ గురించి చాల గొప్పగా చెప్పి నమ్మించి అందులో ఉన్న 3 స్కీం ల ప్రకారముగా కస్టమర్స్‌తో ఎంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్‌ చేయిస్తే, వారికి 8 నెలల కాలములోనే రెండితల లాభము వస్తుందని, కస్టమర్స్‌లతో ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్‌ చేయిస్తే ఉద్యోగులకు బంగారు ఆభరణాలు గిఫ్ట్‌ కూడా ఇస్తామని, అందరు తక్కువ సమయములోనే మంచిగా స్థిరపడి పోవచ్చు అని గ్యారెంటీ కొరకు అగ్రిమెంట్‌, చెక్కులు ఇస్తామని నమ్మకమైన మాటలు చెప్పారు. వారి మాటలు నమ్మి అన్ని బ్రాంచ్‌ల ఉద్యోగులు వారికి తెలిసిన బందువులు, స్నేహితుల వద్ద కోట్ల రూపాయలలో డబ్బులు డిపాజిట్‌ చేయించారు. గడువు తీరి పోయిన తర్వాత ఒక్కొక్క కస్టమర్స్‌ డబ్బులు అడుగగా వారు నలుగురు తప్పించుకొని తిరిగారు. చివరకు మోస పోయినట్లుగా తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ఒక తిరుపతి బ్రాంచ్‌లోనే సుమారు 30 మంది బాధితుల వద్ద సుమారు 1.70 కోట్లు రూపాయలు తీసుకొని మోసగించినట్లుగా తెలిసింది. శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద 4 కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ సంబంధించిన డాక్యూమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి, నిందితున్ని రిమాండుకు తరలించారు. నిందితుడు అరెస్టు, వస్తువుల స్వాధీనానికి సహకరించిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో అలిపిరి సిఐ అబ్బన్న, ఎస్సైలు జయ చంద్ర, రెడ్డప్ప, సిబ్బంది పాల్గొన్నారు.