
ప్రజాశక్తి- మునగపాక రూరల్
అనకాపల్లి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్రి అప్పారావు, ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో వర్షాభావ కారణంగా నీరు లేక ఎండిపోయిన వరి పొలాలను గురువారం రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోనే వ్యవసాయానికి కేంద్రబిందువైన మునగపాకలో ఇంతటి కరువు దుర్భిక్ష పరిస్థితులు ఉంటే జిల్లా మొత్తం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. అనకాపల్లి జిల్లాలో వరి నాట్లు 60శాతం జరగ్గా, 16 మండలాలలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పుడు వరి పొలాలు పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. ఎకరాకు రూ.30 వేలు నుండి రూ.40 వేలు ఖర్చుపెట్టారని, రైతులకు పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 30 టన్నులు వచ్చే చెరకు పంట, వర్షాభావం కారణంగా మూడు, నాలుగు టన్నులకు పడిపోయిందన్నారు. జిల్లాలో ఏడుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారిలో ఇద్దరు మంత్రులు ఉన్నా కరువుపై స్పందించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ఎస్ బ్రహ్మాజీ రైతులు వేగి సూరిబాబు, భీశెట్టి సన్యాసినాయుడు, పి రమణ, వేగి శివ, భీశెట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : అచ్యుతాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు డిమాండ్ చేశారు మండలంలో మల్లవరం, జగన్నాధపురం, తిమ్మరాజుపేట, పెదపాడు, కాజీ పాలెం గ్రామాల్లోని పంట పొలాలను గురువారం రైతు ప్రతినిధులతో కలిసి ఆయన సందర్శించారు. వర్షాభావం కారణంగా వరి పంటలకు తెగుళ్లు సోకాయని, చెరుకు తోటలు ఎదుగుదల దెబ్బతిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తిమ్మరాజుపేట ఉప సర్పంచ్ భీమిశెట్టి రాము, కాండ్రేగుల తవుడుబాబు, సిఐటియు నాయకులు కూండ్రపు సోమునాయుడు పాల్గొన్నారు.
పంటను పరిశీలించిన తెలుగు రైతు నేతలు
కశింకోట : అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొంతుని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కసింకోట మండలం అచ్యుతాపురం గ్రామంలో వరిపంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రోయిన్ల మరమ్మతులు చేయకపోవడం వల్ల శారదా నది నీరు వృథాగా పోతుందన్నారు. జిల్లాలో వర్షాభావం, సాగు దిగుబడులను దృష్టిలో పెట్టుకొని పంట రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి, ఉల్లింగల రమేష్, కర్రి దుర్గునాయుడు, జెర్రిపోతుల నూకు నాయుడు, నారిపిల్లి ప్రసాద్, బల్ల అప్పలకొండ, తెరపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద ధర్నా
అనకాపల్లి : అనకాపల్లి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రవి పటాన్ శెట్టికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేంద్ర, బొద్దపు ప్రసాద్, పోలవరపు త్రినాథ్, పచ్చికూర రాము, నంబారి శ్రీను, అక్కిరెడ్డి రమణబాబు, కసిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.