అనంతపురం కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఏ.నారాయణపురం- 1 గ్రామ సచివాలయం వద్ద పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఇళ్ల వద్దనే వైద్యం అందించేలా ప్రభుత్వం జగన్న సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లినప్పుడు ఆరోగ్యశ్రీ యాప్ను మొబైళ్లలో డౌన్లోడ్ చేయించాలన్నారు. ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించారని, ప్రస్తుతం ఆయా గ్రామాల్లో నిర్వహించే హెల్త్ క్యాంపుల్లో పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డిఎంహెచ్ఒ డా||ఈబి.దేవి, జిల్లా ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపిపి జి.వరలక్ష్మి, జెడ్పిటిసి చంద్రకుమార్, డిఐఒ యుగంధర్, తహసీల్దార్ శ్రీధర్ మూర్తి, డాక్టర్లు భాస్కర్ నాయుడు, అచ్యుత ప్రసాద్, సంధ్య, మనోజ్, బాలగణేష్ తదితరులు పాల్గొన్నారు.










