Oct 24,2023 23:35

వర్షాభావంతో మల్లం గ్రామంలో ఎండిపోయిన వరి పంట

ప్రజాశక్తి- బుచ్చయ్యపేట
ఒక వైపు తీవ్ర వర్షా భావ పరిస్థితులు, మరో వైపు తెగుళ్ల బెడదతో అన్నదాత తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. సకాలంలో వర్షాలు లేక, అరకొరగానే వరినాట్లు వేయగా, తరువాత వరుణుడు ముఖం చాటేయడంతో వేసిన వరి పంట ఎండిపోతుంది. ఇదే సందర్భంలో పంట తెగుళ్ల బారిన పడటంతో రెండు మూడు రోజుల్లోనే రేకులు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు పురుగుల మందుల షాపులకు పరుగులు తీస్తున్నారు.
మండలంలోని వడ్డాది చిన్నప్పన్నపాలెం, దిబ్బిడి, బుచ్చయ్యపేట, కందిపూడి, రాజాం, మల్లం, తురకలపూడి, పెదపూడి, సీతయ్యపేట, గున్నెంపూడి, కేపీ.అగ్రహారం తదితర గ్రామాలలో వరిసాగు చేపడుతున్నారు. గతంలో 6వేల నుండి 7వేల ఎకరాల వరకు వరి సాగు జరిగేది. ఈ ఏడాది వర్షాభావం కారణంగా అరకొరగానే వరి సాగు జరిగింది. వ్యవసాయ శాఖ ఈ క్రాప్‌ నమోదు ప్రకారం మండలంలో వరి సాగు 4588 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి.
వర్షాభావంతో తీవ్ర నష్టం...
ఈ ఏడాది వరి సాగుకు వర్షాభావ పరిస్థితులు తీరని నష్టాన్ని చేకూర్చాయి. వరినాట్ల సమయంలో సకాలంలో వర్షాలు కురవలేదు. బావులు, వ్యవసాయ మోటార్లతో కొద్ది మేరకు వరినాట్లు వేయగా, సెప్టెంబర్‌లో అడపదడపా కురిసిన వర్షాలకు మరికొంత మేరకు వరి నాట్లు వేశారు. అయితే అక్టోబర్‌ మొత్తంగా వరుణుడు ముఖం చాటేయడంతో చెరువుల్లో సైతం పూర్తిస్థాయిలో నీరు లేదు. దీంతో రైతులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో వరి పంటకు సాగు నీరు లేక ఎండిపోతున్నాయి. చెరువుల్లో సైతం నీరు లేకపోవడంతో వరుణుడి కోసం ఎదురుచూస్తున్నారు.
తెగుళ్ల బారిన వరి పంట
ప్రస్తుతం వరి పంట తెగుళ్ల బారిన పడింది. పలు గ్రామాలలో వరి సాగులో ఆకుముడత తెగులు అధికంగా ఉంది. దీంతో రైతుల తీవ్ర ఆందోళన చెందుతూ పురుగుల మందును వరి పంటకు పిచికారీ చేస్తున్నారు. వరి నాట్లు పూర్తయి సుమారు 40 రోజులుగా కావస్తుండగా, ఒక్కొక్క రైతు ఇప్పటికే రెండు నుంచి మూడుసార్లు పురుగుల మందును పిచికారీ చేశారు. ఈ మందుల వల్ల తెగుళ్ల ఉధృతి తగ్గుతుంది తప్ప పూర్తిస్థాయిలో నివారణ జరగటం లేదని రైతులు వాపోతున్నారు. మరో వైపు నీరు లేకపోవడంతో పలు గ్రామాల్లో పురుగుల మందు పిచికారీ చేసిన వరి పంట ఎండిపోతున్నాయి. ఒకవైపు నీరు లేక, మరొకవైపు చీడపీడల ప్రభావంతో రైతులు వరిసాగుపై ఆందోళన చెందుతున్నారు.