అమరవీరుల సేవలను స్మరించుకుందాం: కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: అమరవీరుల సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ పేర్కొన్నారు. త్రిసాయిధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం జిల్లా సైనిక సంక్షేమ అధికారి వారి సిబ్బంది ఎన్సిసి విద్యార్థులు, మాజీ సైనికులు పిసిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ర్యాలీగా జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశసరిహద్దుల్లో దేశం కోసం శత్రుదేశాల సైన్యం, టెర్రరిస్టులతో నిత్యం పోరాటం చేస్తూ వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన బాధ్యత దేశప్రజలపై ఉందనన్నారు. ఎన్సిసి క్యాడేట్లు మంచి పౌరులుగా ఎదగాలన్నారు. అమరవీరుల కుటుంబసభ్యుల సంక్షేమానికి దేశ ప్రజలు విరివిగా విరాళాలు అందించాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్.విజయ శంకర్ రెడ్డి, సిబ్బంది, ఎన్సిసి సుబేదార్ శ్రీసత్యనారాయణ, హవెల్దార్ గణేష్, మాజీ సైనికులుపాల్గొన్నారు.










