
ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడంలో ముందుంటాడు హీరో సూర్య. దీంతోపాటు మాస్ కథాంశాలతోనూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. వీటిలో ఎక్కువగా బలమైన సామాజికాంశాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటాడు. అలాంటి కథాంశాలతోనే ''ఆకాశమే నీ హద్దురా, జై భీమ్'' లాంటి ఒటీటీ బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నారు. కాగా దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సూర్య నటించిన చిత్రం 'ఈటీ' థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఇందులోని ప్రస్తావించిన సామాజిక అంశాలేమిటో తెలుసుకుందాం..
చిత్రం: ఈటీ (ఎవరికీ తలవంచడు)
నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్, మోహన్, వినరు వర్మ, సత్యరాజ్, రాజ్ కిరణ్ తదితరులు,
నిర్మాత: కళానిధి మారన్
రచన, దర్శకుడు: పాండిరాజ్
సంగీతం: డి. ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు
ఎడిటర్: రూబెన్, బ్యానర్ : సన్ పిక్చర్స్

కథలోకి వెళ్తే.. ఉత్తరపురం, దక్షిణపురం ప్రాంతాలు కలిసి ఏటా ఎంతో ఘనంగా మహిళా ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. అయితే అనుకోకుండా జరిగిన ఓ గొడవతో రెండు ప్రాంతాల మధ్య దూరం పెరుగుతుంది. ఉత్సవాలను నిర్వహించడం మానుకుంటారు. దక్షిణపురం ప్రాంతానికి చెందిన కృష్ణ మోహన్ (సూర్య) లాయర్. చిన్నప్పుడే తన చెల్లిని పోగొట్టుకుంటాడు. అప్పట్నుంచి అన్నా అని ఏ ఆడపిల్ల సాయం అడిగినా కాదనడు. తన చుట్టూ ఉన్న మహిళలతో మర్యాదపూర్వకంగా ఉండే వ్యక్తి. ఈ క్రమంలో ఆదిర (ప్రియాంక అరుల్మోహన్) ను ప్రేమిస్తాడు. అతని తండ్రికి ఇష్టం లేకపోయినా తెలివిగా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. మరోపక్క గ్రామంలోని అమ్మాయిలు ఆత్మహత్యలు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతుంటారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం ఫలితముండదు.
ఈ క్రమంలోనే కథలో కామేష్ (వినరు రారు) ప్రవేశించడంతో మలుపు తిరుగుతుంది. సెంట్రల్ మినిష్టర్ కొడుకు అయిన కామేష్.. అమ్మాయిలను రహస్యంగా వీడియో తీసి, బెదిరిస్తుంటాడు. ఓసారి కృష్ణ మోహన్కి దగ్గరి బంధువు కుటుంబం ఇలాంటి బెదిరింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పుల ఒత్తిడి వల్లనే వారు ఆత్మహత్యలు చేసుకున్నారని అందరూ భావిస్తారు. కానీ కృష్ణమోహన్ భార్య ఆదిర స్నేహితురాలికి అలాంటి సమస్యే ఎదురవుతుంది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన కృష్ణమోహన్కు అమ్మాయిల ఆత్మహత్యలు, యాక్సిడెంట్లకు కారణం, ఆ చావుల వెనక ఉంది ఎవరనేది తెలుస్తుంది.
అయితే తన విషయాలను తెలుసుకున్న కృష్ణమోహన్పై కామేష్ పగబట్టి అతన్ని సమస్యల్లో పడేస్తాడు. కోర్టుకు వెళ్లినా లాభం ఉండదు. అప్పుడు కృష్ణమోహన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. తన నిర్ణయం వల్ల ఆ ప్రాంతంలోని మహిళలకు జరిగే మేలు ఏంటి? కృష్ణమోహన్ వారిని ఎలా ఎదుర్కొన్నాడు? వారిని నుంచి 500 మంది అమ్మాయిలను ఎలా కాపాడాడు.. అనేదే మిగతా కథ.
నిజ జీవితంలో తరచూ చోటు చేసుకునే సంఘటనల స్ఫూర్తితోనే ఈ కథని రాసుకున్నాడు దర్శకుడు పాండిరాజ్. యువతుల భయాల్ని ఆసరాగా చేసుకుని వాళ్ల జీవితాల్ని ఎలా నాశనం చేస్తున్నారనే విషయాన్ని ఇందులో ఆలోచన రేకెత్తించేలా చూపించారు. మహిళల్లో స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపే అంశాలు ఇందులో ఉన్నాయి. రెండు గ్రామాల మధ్య జరిగిన సంఘటన ద్వారా ప్రారంభమైన సినిమా అమ్మాయిలపై జరిగే ఆకృత్యాల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. అమ్మాయిలు అంటే బలహీనం కాదు, బలవంతులు అని చాటి చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమ్మాయిలు మనోధైర్యంతో ఉండి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పే చిత్రమిది. రొటీన్ ఫార్ములా అయినా పవర్ ప్యాక్, యాక్షన్ సీన్స్తో మాస్ ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించి మంచి సందేశమిచ్చారు. హీరో, విలన్ల మధ్య వచ్చే సీన్స్ ఛాలెంజింగ్గా ఉంటాయి. ఇంటర్వెల్ యాక్షన్ సీన్, మహిళల నగ చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూసే జనానికి వాటికి కారకులు ఎవరో తెలిసేలా చేయాలని చూపించే సీన్ సినిమాలో హైలెట్గా నిలుస్తాయి.
నటుడిగా సూర్య ఎప్పుడూ బెస్ట్ ఇస్తాడు. ఈ చిత్రంలోనూ చురుకైన యువకుడిగా, చిన్నతనంలోనే అక్కను కోల్పోయిన తమ్ముడిగా, లాయర్గా భిన్నమైన షేడ్స్ను చక్కగా పోషించాడు. ప్రియాంక అరుల్మోహన్ ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ప్రతినాయక పాత్రలో వినరు రారు, తండ్రి పాత్రలో సత్యరాజ్, తల్లిగా శరణ్య, దేవదర్శిని, సూరి తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్ల చిత్రీకరణ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇమామ్ మ్యూజిక్, బిజిఎం సినిమాకి హైలెట్. ఇందులో రెండు పాటలు బాగున్నాయి. రూబెన్ ఎడిటింగ్ ఇంకాస్త మెరుగు పడాల్సింది. ఫైట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కళానిధి మారన్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది.