
ప్రజాశక్తి - జీలుగుమిల్లి
మండలంలో కామయ్యపాలెం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మారుజాతి కలపను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారిణి శ్రీవాణి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారు జామున అటవీ శాఖ సిబ్బంది, రాజమండ్రి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా అడవిలో నుంచి అక్రమంగా మారుజాతి కలపను నరికి 5 ట్రాక్టర్లలో లోడ్ చేసుకొని పొగాకు బ్యారన్లకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. కలప ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని జంగారెడ్డి గూడెంలోని అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో అటవీ శాఖ సిబ్బంది దినేష్, మారేశ్, రహమత్, రాఘవులు పాల్గొన్నారు.