Oct 31,2023 00:05

బాధిత కుటుంబానికి సాయం అందజేస్తున్న వైసిపి నేతలు అనురాధ తదితరులు

ప్రజాశక్తి-దేవరాపల్లి
మండలంలోని వాలాబు పంచాయతీ శివారు పాత వాలాబు గ్రామంలో గిరిజనుడు దిప్పల ఎరకన్నదొరకు చెందిన తాటాకు మిద్దిల్లు ఆదివారం రాత్రి చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో కాలిబూడిదైంది. విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. ఇటీవలే పొలం, వ్యవసాయ పశువులను అమ్మిన సొమ్ము లక్షా 20 వేల రూపాయలు ఇంట్లో పెట్టగా, ఆ మొత్తం అగ్నికి ఆహుతైనట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇంట్లో సామాగ్రి మొత్తం కాలిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సంఘటన స్థలానికి స్థానిక ఆర్‌ఐ ఎన్‌.సతీష్‌ చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రమాద సమాచారం తెలుసుకున్న వైసిపి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఈర్లె అనురాధ, వైసిపి మండల అధ్యక్షులు బూరె బాబురావు, నాయకులు కర్రి సూరి నాయుడు, రొంగలి నారాయణమ్మ, పోడేల నాని తదితరులు సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్న వారు బాధిత కుటుంబానికి రూ.5000 నగదు, 50 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు అందజేశారు. ప్రమాద విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తానని అనురాధ చెప్పారు.