ప్రజాశక్తి - కాళ్ల
రాష్ట్ర అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం ప్రాధాన్యతిస్తోందని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. శుక్రవారం పెదఅమిరంలోని వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక టిడిపి, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలని కోరారు. ప్రజల వద్దకు పాలన అందించేందుకు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు గడపగడపకూ మన ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 'జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్' పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం పెదఅమిరంలో ఇంటింటికీ తిరుగుతూ డోర్కు పోస్టర్, మొబైల్పై స్టిక్కర్ అతికిస్తూ ప్రజా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కాళ్ల, ఉండి, ఆకివీడు జెడ్పిటిసిలు పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, వేగేశ్న వెంకటరాజు, రణస్థుల కనకదుర్గ మహంకాళి, ఎంపిపిలు భూపతిరాజు చంటిరాజు, ఇందుకూరి హరిబాబు, కటారి జయలక్ష్మి, ఆకివీడు మున్సిపల్ ఛైర్ పర్సన్ జామి హైమావతి, పెదఅమిరం గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు పాల్గొన్నారు.
ఆచంట : వైసిపి నుంచి నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే 'జగనన్నే మా భవిష్యత్' మా నమ్మకం నువ్వే జగన్ అని సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షులు సుంకర సీతారామ్ అన్నారు. మండలంలో ఆచంట, కొడమంచిలి, పెదమల్లం, పెనుమంచిలి, భీమలాపురం, ఆచంట వేమవరం, కందరవల్లి, శేషమ్మచెరువు, అయోధ్యలంక గ్రామాల్లో జగనన్నే మా భవిష్యత్' మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సర్పంచులు, నాయకులు వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లకు, గృహసారథులతో గడపగడపకూ వెళ్లారు. ఈ సందర్భంగా సుంకర సీతారామ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ వెళ్లి స్టిక్కర్లను వారి అనుమతితో తలుపులకు అతికించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించి, 82960 82960కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. జగనన్న పాలనలో పేదల ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ కార్యక్రమం ద్వారా తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ కుమార్, సర్పంచులు కోట సరోజినీ వెంకటేశ్వరరావు, గణేశుల శేషవాణి సుబ్బారావు, జక్కంశెట్టి చంటి పాల్గొన్నారు.










