Apr 05,2023 21:08

ప్రజాశక్తి - ఉండి
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన ప్రతి సచివాలయానికీ రూ.20 లక్షల నిధులు కేటాయించడంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టవచ్చని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. బుధవారం మహదేవపట్నం గ్రామాభివృద్ధికి కేటాయించిన రూ.20 లక్షలతో ఎస్‌సి కాలనీలో రెండు సీసీ రోడ్లు, బొక్కవారిపాలెంలో ఒక సీసీ రోడ్డు నిర్మించడానికి, తాగునీటి చెరువు అభివృద్ధికి పివిఎల్‌ నరసింహరాజు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆయన స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం పివిఎల్‌ నరసింహరాజు మాట్లాడుతూ మహదేవపట్నం గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. మండలంలో ఎక్కువ అభివృద్ధి మహదేవపట్నం గ్రామంలోనే జరిగిన విషయం ప్రతి పౌరుడూ గుర్తుంచుకోవాలన్నారు. నూతనంగా ఉండి అగ్రికల్చరల్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా మహదేవపట్నం గ్రామానికి చెందిన కడలి శ్రీనివాస్‌ నియామకం దాదాపుగా పూర్తయిందన్నారు. వైసిపి గ్రామ అధ్యక్షులు ముదునూరి సుబ్బరాజు మాట్లాడుతూ గ్రామంలో మూడు సీసీ రోడ్లకు భూమి పూజ, తాగునీటి చెరువు అభివృద్ధికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గులిపల్లి అచ్చారావు, ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, నాయకులు మద్దా అభిషేక్‌ రాజు, కడలి శ్రీనివాస్‌, గుత్తుల కృష్ణప్రసాద్‌, బాలం తులసి పాల్గొన్నారు.