
ప్రజాశక్తి - కైకలూరు టౌన్
ప్రభుత్వ అభివృద్ధి పనులకు దాతలు సహకరించాలని కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ అన్నారు. కైకలూరు తహశీల్దార్ కార్యాలయ భవనాన్ని ఎంఎల్సి జయమంగళ వెంకటరమణ, ఎంఎల్ఎ దూలం నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 నెలల క్రితం తహశీల్దార్ కార్యాలయ సందర్శనకు వచ్చిన సందర్భంలో కార్యాలయ పరిస్థితిని శాసనసభ్యుల దృష్టికి తీసుకువచ్చి భవనాన్ని పూర్తిచేసే బాధ్యత చేపట్టాలని తెలిపామని, దీనికి ఆయన వెంటనే స్పందించి దాతల సహకారంతో కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాన్ని నిర్మించారన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు ప్రజలు, వివిధ సంస్థలు, దాతలు ముందుకు వచ్చి చేయూతనిస్తే మంచి భవనాలు నిర్మించివచ్చని తెలిపారు . కైకలూరులో చేపడుతున్న జగనన్న గ్రీన్ లే అవుట్ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. కొల్లేరు ప్రాంతంలో ఇండిస్టీలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కొల్లేరు చుట్టూ పది కిలోమీటర్ల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతులు వచ్చాయని, దీనికి అనువుగా గ్రామసభలు నిర్వహిస్తున్నామని, ఈ పది కిలోమీటర్ల భూమి తగ్గించడం వల్ల ఆక్వా ఇండిస్టీస్, ఇతర పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం ద్వారా పరిశ్రమల ఏర్పాటు జరిగి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి మూలధనంలో కైకలూరు, కలిదిండి ఎక్కువ సమకూర్చుతున్నాయని, జిడిపి అభివృద్ధి కూడా అధికమని, ఇది ఇక్కడి ప్రజల, శాసన సభ్యుల కృషేనన్నారు. జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గం అభివృద్ధికి శాసనసభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ ఎంతగానో తోడ్పాటునిచ్చారన్నారు. దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో ఎంఎల్సి, కలెక్టర్, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఒ ఎస్కె.కాజావలి, ఎంపిపి అడవి వెంకటకృష్ణ మోహన్, సర్పంచి దానం మేరీ నవరత్నకుమారి, జెడ్పిటిసి సభ్యులు కూరెళ్ల బేబీ, తహశీల్దార్ మురళీకృష్ణ పాల్గొన్నారు.