Apr 07,2023 12:32

ప్రజాశక్తి -పెనుకొండ (అనంతపురం) : పెనుకొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా ఎన్నికైన డి.నాగరాజు శుక్రవారం పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ దృష్టికి న్యాయవాదుల సమస్యలను తీసుకెళ్లారు. ఈ సందర్బంగా ఈరోజు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్‌ నారాయణను బార్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షులు డి.నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్నిచ్చి స్వీట్లను అందజేశారు. ఇటీవల బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికైన నాగరాజును ఇతర సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం పెనుకొండ కోర్టు వద్ద నెలకొన్న సమస్యలపై నాగరాజు ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. కోర్టు ప్రాంగణంలో ఇప్పుడు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కోర్టు, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, సబ్‌ కోర్టు నడుస్తున్నందున కోర్టుకు కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు సరైన వసతులు లేవని, నూతన భవనాలు నిర్మించాలని కోరారు. కోర్టు ప్రాంగణంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వంతో చర్చించి అదనపు జిల్లా కోర్టు తీసుకురావడానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. కోర్టు జడ్జిలకు విశ్రాంతి భవనము, ఛాంబర్‌ లు ప్రాంగణము వద్ద పార్కింగ్‌ సౌకర్యం, సిబ్బందికి తగిన భవనాలు లేవని కాబట్టి కేస్‌ ఫైల్‌ పెట్టుకోవడానికి సరైన సదుపాయాలు లేవని వీటిపై వెంటనే శ్రద్ధ చూపాలని నాగరాజు ఎమ్మెల్యే కు విన్నవించారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని, పెనుకొండ కోర్టు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, కనీస సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ న్యాయవాదులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ లైబ్రరీ సెక్రెటరీ విక్రాంత్‌ నాయక్‌, న్యాయవాదులు శివశర్మ, శ్రీనివాసులు, నాగిరెడ్డి , బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.