ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి(చిత్తూరు) : కైకల్ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఎం.బి.బిఎస్ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పం పిఇఎస్ హాస్పిటల్లో పని చేస్తున్న ఎం.బి.బిఎస్ స్టూడెంట్ భాను ప్రకాష్ పండగ సందర్భంగా బుధవారం స్నేహితులతో కలిసి కైగల్ జలపాతం దగ్గరకు వచ్చారు. మధ్యాహ్నం సరదాగా ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి వరద నీటిలో పడిపోయాడు. నీరు ఉధృతంగా ప్రవహిస్తుడటంతో భాను ప్రకాష్ నీటిలో మునిగి పోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకట నరసింహులు సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది సాయంతో మృత దేహాన్ని జలపాతం నుండి వెలుపలకు తీసుకువచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.










