
'అరె! ఇది కూడా చేయలేవా..? పొద్దస్తమానూ ఏం చేస్తావ్ ఇంట్లో ఉండి..? నాలుగు మెతుకులు వండటం కూడా పనేనా..? నువ్వొక్కదానివేనా ఆపరేషన్ చేయించుకుంది..!' లాంటి మాటల ఈటెలు గుచ్చుకోవడం. కాదుకాదు.. దిగబడుతుంటే..! లింగ నిర్ధారణ పరీక్షల దగ్గర నుంచి భ్రూణహత్యలు.. బాల్యవివాహాలు.. వరకట్న వేధింపులు.. గృహ హింస.. ఆఫీసుల్లో.. ఉన్నత పదవుల్లో.. ఇలా వివిధ రూపాల్లో స్త్రీలపై జరుగుతోంది హింస. హైదరాబాద్ డిఎవి స్కూల్లో నాలుగేళ్ల పాపపై అత్యాచార పర్వం.. పారాణి సైతం ఆరని ఆడపిల్ల హత్య.. నెల్లూరులో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక హింస.. నేరేడుమిట్టలో బిడ్డ తల్లి హత్య.. ఇలా ఒకటా.. రెండా.. స్త్రీలపై జరుగుతున్న దారుణాలకు.. వయసుతోనూ, వావి వరుసలతోనూ సంబంధం లేదు.. ఇంటా, బయటా అనే తేడా లేదు. ఈ హింసలు ఒక ప్రదేశానికో, ఒక దేశానికో పరిమితం కాలేదు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు.. అమెరికా నుంచి అండమాన్ వరకు.. ప్రపంచంలోని అత్యధిక దేశాల్లో ఒక 'సామాజిక సమస్య' గా మారిపోయింది. దేశాల మధ్య భౌగోళిక దూరాలు ఉన్నాయేమోగానీ, స్త్రీలపై జరిగే హింస విషయంలో పురుషాధిక్య ప్రపంచమే రాజ్యమేలుతోంది. ఈ హింసను ఆపాలి.. అంతమొందించాలి.. రూపుమాపాలి.. ఎలా? ఐక్యరాజ్య సమితి నవంబరు 25వ తేదీని 'అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం'గా ప్రకటించింది. ఈ హింసను అంతం చేయడానికి ఒక్కరోజు సరిపోదనే ఉద్దేశ్యంతో కాలానుగుణ మార్పులు జరిగాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది 'మహిళలు, బాలికలపై హింసను అంతం చేయాలి' అనే నినాదాన్ని ప్రపంచవ్యాపితంగా ప్రచారం చేసే కార్యక్రమం 18 రోజులపాటు (నవంబరు 25 - డిసెంబరు 12) జరుగుతుంది. ఈ సందర్భంగానే ప్రత్యేక కథనం..
సూది గుచ్చుకున్నా.. వేడి గిన్నె కాలినా.. చిన్న దెబ్బ తగిలినా.. తల్లడిల్లిపోతాం. అలాంటిది దారుణంగా ముక్కలు చేసి, రక్తం చిందేలా, చచ్చిపోయేలా కొడితే తట్టుకోవడం సాధ్యమా? మాటలతో చేసే గాయాలకు మనసు ఛిద్రమైతే.. భౌతికదాడితో శరీరమంతా గాయాలే.. అందుకే ఆమెను 'నడిచే గాయమా.. నారీ లోకమా!' అన్నారు కవి. హింసకు అసలు కారణం పురుషాధిక్య భావజాలం.. హింసకి చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకు అందరం సమాయత్తమవ్వాలి. స్త్రీల సమస్యలు సమాజాభ్యున్నతికి ఆటంకం. హింసను ప్రేరేపించే ఆధిపత్య భావజాలానికి అడ్డుకట్ట వేసి, దాన్ని సమూలంగా అంతం చేయాలి.

- నేనేం చేశాను..!
'ఆడపిల్ల వద్దు మగ పిల్లవాడైతే వారసత్వాన్ని నిలబెడతాడు' లాంటి అనాగరికపు ఆలోచన ఎన్నో దారుణాలకు ఒడిగడుతుంది. గర్భం దాల్చినప్పుడే తల్లి ఇష్టంతో సంబంధం లేకుండా భర్త, అత్త మామలు అబార్షన్ చేయించిన సందర్భాలు నిత్యం చూస్తున్నాం. ఆ తల్లి ఒప్పుకోకపోతే హింసించడం, లాభం లేదనుకుంటే చంపేయడం మనకు ఎదురౌతున్న సంఘటనలే. అసలు తల్లికే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేక గర్భం తీయించుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ దారుణాన్ని అరికట్టాలని 1994లో 'గర్భస్థ పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టం' (పి సి పి ఎన్ డి టి చట్టం) మన దేశంలో వచ్చింది. అప్పటి నుంచీ ఈ చట్టం అమలు జరిగితే ఇప్పుడు 'నేనేం చేశాను..!' అనే ప్రశ్న మన చెవుల్లో హోరెత్తేది కాదు. చట్టం అమలుతో పాటు ప్రజల్లో అవగాహన కలిగించడం చాలా అవసరం. అది ప్రకటనల రూపంలో, ప్రసారమాధ్యమాల ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలాంటి చైతన్యం ప్రజల్లో తీసుకురావాలనేదే ఈ పద్దెనిమిది రోజుల కార్యక్రమం ఉద్దేశ్యం.

- స్కూల్లోనే ఎంత దారుణం..?
'ఆడపిల్లకు చదువెందుకు' అనే ఆలోచన నుండి సమాజం బయటపడటానికి శతాబ్ద కాలం పట్టింది. అదీ కొంతవరకే. ఆడపిల్లకి చదువు మానసిక స్థైర్యాన్ని, సామాజిక అభివృద్ధిని ఇచ్చేదిగా ఉండాలి. కానీ.. ప్రతిరోజూ ప్రైమరీ స్కూల్స్ స్థాయి నుంచే ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి..! డిఎవి స్కూల్లో నాలుగేళ్ల పాప, నెల్లూరులో తొమ్మిదేళ్ల బాలిక.. లైంగిక హింసకు గురయ్యారని.. ఇవేనా.. ఇంకా వెలుగులోకి రాని ఘోరాలెన్నో ఎన్నెన్నో.. ఎలా వీటిని భరించాలి? మరి ఎలా అరికట్టాలి? ఈ ఘాతుకాలు వింటుంటే ఎన్ని ప్రశ్నలు మనల్ని నిలదీస్తున్నాయి? వాటికి సమాధానం ఎవరు చెప్తారు? మనమే ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి.

- పుత్తడిబొమ్మ పూర్ణమ్మలు..
పందొమ్మిదో శతాబ్దంలోనే బాల్యవివాహాలు సాంఘిక దురాచారమని, రాజా రామమోహన్ రారు, కందుకూరి వీరేశలింగం వంటి గొప్ప సంఘ సంస్కర్తలు ఎలుగెత్తి చాటారు. ఫలితంగా ఇరవయ్యవ శతాబ్దంలో అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేయాలని 'బాల్య వివాహ నిరోధక చట్టం' తెచ్చారు. అయినా ఇప్పటికీ పిన్న వయసులోనే వివాహాలు కొనసాగుతున్నాయి. నిరక్షరాస్యత.. ఆర్థిక అసమానతలు.. బాలికలను జాగ్రత్తగా పెంచలేమన్న అభద్రతా భావం.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న బెంగ.. కారణం ఏదైనా కావచ్చు. ఎదిగీ ఎదగని వయసులో హార్మోన్స్ బ్యాలన్స్ లేక ఎంతమంది పూర్ణమ్మలు బలౌతున్నారు..? బాల్య వివాహ నిరోధక చట్టంతోనే ఈ సమస్య తీరేది కాదు కదా.. అసలు మూలాల్లో పరిష్కారాలు కావాల్సి ఉంది. అప్పుడు చట్టం అమలు జరిగేలా చెయ్యడంతో పాటు, అమ్మాయి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. అందుకు ఆర్థిక విధానాల్లోనే మార్పు రావాలి. ఇది సమాజం మార్పుతోనూ ముడిపడి ఉంది.

- వేధింపులేనా.. వధింపులూనూ..!
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచీ.. 'తిన్నా తినకపోయినా పిల్లను బయటికి పంపించాలంటే నాలుగు రాళ్ళు వెనకేయాలి'.. అని, 'అమ్మాయి ఎక్కువ చదివితే అంతకంటే ఎక్కువ కట్నం ఇవ్వాలి.. చదివిన అబ్బాయిని తీసుకురావాలి.. అని' మధ్యలోనే చదువు మాన్నించేసే తల్లిదండ్రులను చూశాం. చూస్తున్నాం. అన్ని త్యాగాలు చేసి, భద్రంగా దాచిన సొమ్మును పెళ్ళికొడుకుకు సమర్పించినా, తన కూతురు క్షేమంగా ఉంటుందనే నమ్మకం లేదు. పారాణి ఆరకుండానే కాటికి పంపుతున్న వైనం. చదువులేని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇళ్ళలోనే ఇలా జరగడం లేదు. సాఫ్ట్వేర్లు, కోటీశ్వర్ల కోడళ్ళకూ ఇదే దుస్థితి. ఈ పరిస్థితి నుంచి ఆడపిల్లలను కాపాడాలని ఎన్నో ఉద్యమాలు జరిగాయి. సామాజిక దృక్పథంతో సినిమాలూ వచ్చాయి.
వరకట్న నిరోధక చట్టం 1961లో వచ్చింది. ఆ స్ఫూర్తితో 1968లో 'వరకట్నం' అనే సినిమా కూడా వచ్చింది. కానీ ప్రజల్లో అవగాహనతోపాటు జీవన ప్రమాణాలు పెరగాల్సింది పోయి, డబ్బు మీద వ్యామోహం పెరుగుతూ వచ్చింది. ఆ వ్యామోహం హింసాత్మక చర్యలను ప్రేరేపిస్తుంది. ఇలాంటి హింసలు కేవలం శిక్షలతోనే అంతమవ్వవు. తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువులవ్వాలి. చిన్నప్పటి నుంచే నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించాలి. దీనికి తల్లిదండ్రుల తర్వాత టీచర్లు పూనుకోవాలి. చదువుతోపాటు సామాజిక విలువలు నేర్పాలి. వారి భవిష్యత్తు దేశాభివృద్ధికి తోడ్పడేలా తీర్చిదిద్దాలి.

- ఇది కూడా హింసే..!
గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే.. ఇంట్లో పెద్దలే పరిష్కరించేవారు. మరికొంచెం పెద్దగొడవ, అత్తింటి వారి నుండి ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తే పెద్దమనుషులు పరిష్కారం చేసేవారు. కాలం మారింది. చదువు, ఉద్యోగాల వెసులుబాటు, ఆస్తులు, అంతస్థుల్లో వ్యత్యాసంలాంటి అనేక కారణాలతో ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేవు. తల్లిదండ్రులతోనూ పిల్లలు కలిసి ఉండలేకపోతున్నారు అనేకన్నా.. అలాంటి పరిస్థితులు ఉండటం లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితులే అందుకు కారణం. కుటుంబ భారం వల్లనైతేనేమి.. ఆఫీసుల్లో పని ఒత్తిడి అయితేనేమి.. ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కొనే శక్తిని కోల్పోతున్నారు. దాంతో చిన్న చిన్న విషయాలకే కోపాలు, కొట్లాటలు, గొడవలు పెరుగుతున్నాయి. కొన్నిసార్లు అవి శృతిమించి హత్యలు, ఆత్మహత్యలు, భౌతిక, లైంగిక దాడులకు దారి తీస్తున్నాయి.
ఆయా సందర్భాల్లో మహిళలు ఎన్నో ఆంక్షలు, అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వారి ఆలోచనలకు విలువ ఉండటం లేదు. ఆమె సంపాదనపైనా ఆమెకు పూర్తి హక్కులేదు. పిల్లలపైన అధికారం లేదు. ఈ మధ్య 'అమ్ము' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో అమ్ము పాత్ర ఇప్పటి స్త్రీ జీవన విధానానికి ప్రతీక. భర్తకు చిన్న విషయానికే కోపం రావడం.. ఆమెపై చేయిచేసుకోవడం.. మరల తప్పైపోయింది క్షమించమనడం.. సర్వసాధారణం అన్నట్లు సాగిపోతుంది. ఇలా రోజుల నుండి నెలల వరకూ ఇంటి గుట్టు బయట పెట్టకూడదనే ఆలోచిస్తుంది ఆమె. తల్లిదండ్రులతో కూడా చెప్పదు. మౌనంగానే భరిస్తుంది. ఏంటి.. ఇలా ప్రవర్తిస్తున్నాడు.. అని ఆమెలో ప్రశ్న మొదలైన ప్రతిసారీ టెన్షన్లో ఉన్నాడులే అని సరిపెట్టుకుంటుంది. కొన్నిసార్లు వెళ్ళిపోదామని బయలుదేరి, తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారని ఆగిపోతుంది. ఇది సినిమానే అని కొట్టిపారేయలేము. నిజ ప్రపంచంలో ఎంతమంది స్త్రీలు ఎన్నిరకాలుగా ఇలాంటి హింసను అనుభవిస్తున్నారో..! కొంతమంది ఎంత భయంకరమైన హింస జరిగినా, తన ప్రాణాలకు ముప్పు ఏర్పడినా భరిస్తున్నారు.. తనువు చాలిస్తున్నారేగానీ, బయటకు రాలేకపోతున్నారు. ఇలా కుటుంబాల్లో జరిగే హింసని నేరంగా గుర్తించాలని, దానికోసం ఒక చట్టం చేయాలని మహిళా సంఘాలు ఉద్యమించాయి. ఫలితంగా 2005లో 'గృహ హింస నిరోధక చట్టం' వచ్చింది.
- గృహహింస నిరోధక చట్టం..
నేరం చేసిన వాళ్ళను దండించడమే కాకుండా, బాధితులకు (స్త్రీలకు) ఉపశమనం కల్పించే దిశగా ఈ చట్టం పనిచేస్తుంది. తన కుటుంబంలోని వారు భర్త, అత్తమామలు, బావ, మరిది, తండ్రి, అన్నదమ్ములు, ఎవరైనా సరే శిక్షార్హులే. వారు జరిపే ఎటువంటి హింసనుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకే ఈ చట్టం. అంటే స్త్రీకి స్థానబలం కల్పించిందని చెప్పుకోవచ్చు.
- ప్రాథమికంగా..
సమస్య ప్రారంభంలో.. వైవాహిక జీవితంలో భర్త నుంచి ఎదురైతే మెజిస్ట్రేట్ బాధ్యత తీసుకుని కుటుంబ పెద్దగా భర్తను సరిదిద్దుకోమని మందలిస్తారు. భార్య, పిల్లలు, తల్లి ఎవరికైనాసరే ఈ చట్టం వర్తిస్తుంది. సున్నితమైన విషయంగా పరిగణించి పోలీసులు, కేసుల వరకు వెళ్ళకుండా పరిష్కార దిశగా ఈ విధమైన ప్రయత్నం చేస్తారు. ఆ వ్యక్తి మరల అదేవిధంగా ఇబ్బంది పెడుతున్నా, హింస పెరిగినా రక్షణ చర్యల ధిక్కార నేరం కింద పరిగణించి, శిక్షించే అధికారం ఈ చట్టానికి ఉంది. మహిళలు, 18 సంవత్సరాలలోపు పిల్లలకు చట్టం వర్తిస్తుంది.

- ఏదైనా..!
ఏ మహిళైనా కుటుంబ సంబంధిత వ్యక్తి ద్వారా హింసకు గురైతే, కుటుంబ హింస కిందికే వస్తుంది. శరీరానికి హాని, నష్టం కలిగించే చర్యలన్నీ శారీరక హింస కిందికే వస్తాయి. అంటే శరీరానికి బాధ, హాని, గాయం చెయ్యడం, ప్రాణహాని తలపెట్టడం, లైంగిక సంబంధ విషయంలో బలవంతపెట్టడం, ఆమె గౌరవానికి భంగం కలిగించే మాటలు లైంగిక హింస కిందకే వస్తాయి. అవమానకరంగా మాట్లాడటం, హేళన చేయడం, చిన్న బుచ్చడం, పిల్లలు పుట్టలేదని నిందించడం, మగపిల్లాడిని కనలేదని వేధించడం, బాధితురాలికి సంబంధించిన వ్యక్తుల్ని శారీరకంగా హింసిస్తానని, చంపేస్తానని బెదిరించడం ఇవన్నీ మానసిక హింస కిందకు వస్తాయి.
- కుటుంబ నిర్వహణకు అవసరమైన డబ్బు భార్యకు ఇవ్వకపోవడం.
- చట్టప్రకారం హక్కుగా పొందిన వాటి మీద ఆమెకు హక్కు లేకుండా చెయ్యడం.
- కోర్టు ఉత్తర్వుల ద్వారా ఆమెకు చెందిన నగదు, వనరులను ఆమెకు దక్కకుండా చెయ్యడం.
- అదనపు కట్నం తెమ్మని వేధించడం.
ఇవన్నీ ఆర్థిక హింస కిందకు వస్తాయి. భర్తే కాకుండా ఇతర సంబంధీకులు ఎవరైనా స్త్రీని హింసకు గురిచేస్తే ఈ చట్టం రక్షణ కల్పిస్త్తుంది.

- నోటిమాటే చాలు..
కుటుంబంలో మహిళలు శారీరక, మానసిక, లైంగిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపులకు గురయ్యే సందర్భంలో ఈ చట్టం ద్వారా న్యాయం పొందవచ్చు. ఒక ఇంటిలో కుటుంబ హింస జరుగుతుందని గానీ, జరిగే ప్రమాదం ఉందనిగానీ సమాచారం అందితే.. నోటి మాటైనా సరే చట్టం పరిగణనలోకి తీసుకోవాలి. రాయలేని వారు నోటితో చెప్పిన సమాచారాన్ని రక్షణాధికారి తానే పేపర్పై రాసి, సమాచారం ఇచ్చినవారి సంతకం తీసుకోవాలి.
ఆ అధికారి పోలీసుల సహాయంతో సంఘటనా స్థలానికి వెళ్ళి, సంఘటన నివేదిక తయారు చేసి, మెజిస్ట్రేటుకు అందించాలి. ఒకవేళ బాధితురాలి శరీరంపై గాయాలు, దెబ్బలు వుంటే వెంటనే ఆమెకు వైద్యపరీక్షలు జరిపించి, వైద్య సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేయాలి. రిపోర్టులను సంఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న పోలీసు స్టేషనుకు, మేజిస్ట్రేట్కు పంపించాలి. అయితే చట్టం వచ్చి ఇంత కాలమైనా.. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో రక్షణాధికారుల నియామకం జరగలేదు. స్త్రీకి న్యాయం జరగడం లేదు.
చట్టం గురించి వింటుంటే ఆహా ఇన్ని అవకాశాలున్నాయా అనిపిస్తుంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి స్రీకి ఆ విధమైన రక్షణ లభించడం లేదు. ప్రభుత్వాలు, పాలకులు, స్వచ్చంధ సంస్థలు, మీడియా తమ వంతుగా ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అమలు తీరులో లోపం లేకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
- నిరంతర కృషి!
ఒక కార్యకర్త తరానా బుర్కే 2006లో స్థాపించిన 'మీటూ' ఉద్యమ స్ఫూర్తితో.. మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను నిరోధించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా సమీకరణ జరిపింది. దీనికి ఉద్యమ కార్యకర్తలు, అట్టడుగు వర్గ ప్రజలు, మహిళ- మానవహక్కుల సంఘాలు, కొంతమంది న్యాయవాదులు నిరంతర కషి చేశారు. నవంబరు 25 - డిసెంబరు 10 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అనేక దేశాల నుండి ఈ ఉద్యమానికి వినూత్నమైన ఆదరణ వచ్చింది. ఆ సమయంలో ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ గ్లోరియా మకాపగల్-అర్రోయో ఆ ప్రకటనపై సంతకం చేసి, 18 రోజులకు పొడిగించాలని సూచించారు. అప్పుడు నవంబరు 25 - డిసెంబరు 12 వరకు 18 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి 2008లో దీన్ని అధికారికంగా ప్రకటించింది.
ఏదేమైనా హింసను అంతం చేయాలి. ఆడపిల్లను పుట్టనీయకుండా గర్భస్థపిండగానే చంపేసే దగ్గర నుంచి స్త్రీ అంటే ఒక చులకన భావనతో అణచేస్తున్నారు. ఆమె కూడా తమలానే మనిషి అనే సమభావం రావాలి. ఆమె ఆర్థికంగా, సామాజికంగా సగభాగంగా ఉందనే వాస్తవాన్ని గుర్తించాలి. నిర్ణయాత్మక విషయాల్లో ఆమెనూ భాగస్వామ్యం చేయాలి. స్త్రీల సమస్యలు ఆమెకే పరిమితం కాదు. యావత్తు సమాజాభ్యున్నతికి స్త్రీ భాగస్వామ్యం అవసరం. అది గుర్తెరగాల్సిన తరుణం ఇది. అందుకే బాలికలపైనా, స్త్రీలపైనా జరిగే హింసకు చరమగీతం పాడదాం. సమాజా భ్యున్నతికి అందరం పాటు పడదాం.
టాన్యా
7095858888