Feb 09,2023 21:37

​​​​​​ప్రజాశక్తి- జీడీనెల్లూరు (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలంలోని బంగారెడ్డిపల్లి పంచాయతీ సమిసిరెడ్డిపల్లి గ్రామంలో లోకేష్‌ నిర్వహిస్తున్న 'యువగళం' పాదయాత్ర బందోబస్తు విధులకు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్‌ ఎ.రమేష్‌ (52) గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ఎస్‌ఐ వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రమేష్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఐరాల పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన అదే ఊర్లో ఉంటున్నారు. పని ఒత్తిడి వల్లే గుండెపోటుకు గురైనట్లు సమాచారం. చిత్తూరు జిల్లా ఎస్‌పి వై.రిశాంత్‌రెడ్డి స్పందిస్తూ, రమేష్‌ కుటుంబానికి పోలీసు శాఖ తరుఫున రావాల్సిన అన్ని ప్రయోజనాలనూ 15 రోజుల్లో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కుటుంబంలో అర్హత ఉన్న వారికి ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.