Aug 16,2023 15:33

ప్రజాశక్తి-వి.కోట(చిత్తూరు) : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చిత్తూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు. మండల కేంద్రమైన వి కోటలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వారు అకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో మౌలిక సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో త్రాగునీరు, విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. సంబంధిత అధికారులను పిలిపించి తక్షణమే సమస్యను పరిష్కరించారు. జెడ్‌.పి. నిధులతో నూతన బోరు మోటార్‌ ను మంజూరు చేసి తక్షణమే బోరు మోటార్‌ ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ అధికారులను తక్షణమే విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్‌ మరమత్తులు చేపట్టి 24 గంటలు హాస్పిటల్‌లో ఎలాంటి విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వి.కోట 30 పడకల ప్రభుత్వ హాస్పిటల్‌ను 100 పడకల హాస్పటల్‌గా అభివృద్ధి చేసేందుకు సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపాలని మెడికల్‌ ఆఫీసర్‌ని ఆదేశించారు. వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవల అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా.కేశవులు, డా.మురళీకృష్ణ, డా.ప్రవీణ్‌, డా.సల్మా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.