
ఎండ.. వాన.. చలి.. ఇలా కాలంతో.. సందర్భంతో.. సమయంతో.. పనిలేకుండా.. ఇంటి వద్ద నుంచే ఆహారం, ఎలక్ట్రానిక్స్, కిరాణా సామాగ్రి, ఇతర వస్తువులను ఇళ్ల నుంచే ఆర్డర్ చేస్తున్నాం.. పెరుగుతున్న టెక్నాలజీ మనకు అలాంటి సౌలభ్యాన్ని కల్పిస్తుంది.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఇవన్నీ మన అవసరాలే.. మనకు కావాల్సిన వస్తువులే.. కానీ వర్షం వచ్చినా ఎండలో వెళ్లాలన్నా.. వెనకాడుతాం.. అలాంటిది ఎండ.. వాన.. చలి అనకుండా రాత్రి, పగలు సమయంతో పనిలేకుండా మనకు ఇంటి వద్దకే అన్నీ సమకూరుస్తున్న సేవకులే 'గిగ్' కార్మికులు.. వినియోగదారులకు అన్ని సదుపాయాలూ కల్పించే వీరికి.. ఎలాంటి సదుపాయాలూ లేని దయనీయ స్థితిలో విధులు నిర్వహిస్తున్నారు. చెల్లింపుల్లో హెచ్చుతగ్గులు, బీమా లేకపోవడం, ఉద్యోగ భద్రత వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వీరిపైనే ఈ ప్రత్యేక కథనం..

'అబ్బా ఆకలేస్తుంది. బిర్యానీ 'స్విగ్గీ' చేయాలి..
ఈ రోజు క్యారియర్ తేలేదు.. లంచ్ 'జొమాటో' చేస్తే పోద్దీ..
మా వారు ఊళ్లో లేరు.. అందుకే 'ఓలా' బుక్ చేశారు..
సమయానికి బండి పాడైంది.. 'రేపిడో' బుక్ చేస్తే పోద్ది..'
ఇవి ప్రస్తుతం నగరాల్లో నివసించే సగటు మానవుని రోజువారీ జీవితంలో నిత్యం ఉపయోగించే పదాలైపోయాయి.
మొబైల్ యాప్ల ద్వారా ఉత్పత్తులు, సేవలను పొందే సౌలభ్యం రోజు రోజుకూ పెరగడంతో సేవల రంగంలో ఉపాధి పెరుగుతోంది. అయితే అందులో పనిచేసే కార్మికులకు మాత్రం ఉద్యోగ భద్రత లేదనే చెప్పాలి. ఓవైపు భారత్లో 'గిగ్' ఎకానమీ నిరుద్యోగ సంక్షోభానికి పరిష్కారం చూపుతోందని చెబుతున్నారు కొందరు మేధావులు. అది పాక్షికమే.. కానీ గిగ్ వ్యవస్థలో ఉన్న లోపాలు కార్మికుల జీవితాలపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయనేది వాస్తవం.
ముఖ్యంగా 2019 నుంచి 2021 వరకూ కరోనా మహమ్మారి కాలంలో భారత్లోని డిజిటల్ వ్యాపార సంస్థలు విపరీతమైన వృద్ధిని సాధించాయి. అంతేకాదు 105 కొత్త స్టార్టప్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. అయితే వివిధ కారణాల వల్ల 2022 నాటికి పెట్టుబడిదారులు కంపెనీల నుంచి వైదొలగడం ప్రారంభించారు. ఫైనాన్షియల్ సెక్టార్లో ఏర్పడిన చీకటి కాలం ఈ ప్రతికూల పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఫలితంగా ఈ ఏడాది చివరి నాటికి సుమారు 50 వేల మందికి పైగా ఉద్యోగులను ఈ కంపెనీలు తొలగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా.

స్టార్ట్-అప్ ట్రాకర్ ఐఎన్సి 42.కాం, బిజినెస్ మీడియా ఏజెన్సీలు సంయుక్తంగా విడుదల చేసిన రిపోర్టు 2022 ప్రకారం ఇప్పటివరకూ మార్కెట్ విభాగాల్లో 34 స్టార్టప్ల ద్వారా 11,363 మంది ఉద్యోగులను తొలగించినట్లు గుర్తించారు. వీటిలో ఓలా, మీషో, కార్స్-24, వేదాంతు, మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపిఎల్), ఉడాన్, బ్లింకిట్, ట్రెల్ వంటి కంపెనీలు రిట్రించ్మెంట్కు పాల్పడ్డాయి.
అత్యధిక సంఖ్యలో 11 ఎడ్టెక్ కంపెనీలు 4,068 మందికి పింక్ స్లిప్లను అందించాయి. కరోనా కాలంలో భారత్లో పాఠశాలలు మూతబడిన రెండేళ్ల తర్వాత తిరిగి పునఃప్రారంభం కావడంతో ఆన్లైన్ అభ్యాసం దెబ్బతింది. దీంతో అనెకాడమీ 1,000 మందికిపై ఉద్యోగులను తొలగించింది.
పెరిగిపోతున్న నిరుద్యోగం..

దేశంలో నిరుద్యోగం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఓ వైపు ఉపాధి కల్పనలో మేము తోపులమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డాంబికాలు పోతాయి. మరోవైపు డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తిచేసిన యువకులు ఉపాధి కోసం ఆన్లైన్ పోర్టల్స్ని ఆశ్రయిస్తున్నారు. బతుకుదెరువు కోసం డెలివరీ బార్సుగా చేరుతున్నారు. ఐదేళ్ల క్రితం ఐదు శాతం ఉన్న నిరుద్యోగ రేటు గతేడాది 8.35 శాతానికి చేరింది. కాగా, ఈ ఏడాది జనవరి నాటికి 6.56 శాతానికి తగ్గినప్పటికీ మళ్లీ భారీగా పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో 9.6 శాతం, పట్టణాల్లో 7.7 శాతం నిరుద్యోగిత రేటు ఉందని వివరించింది. అయితే స్టార్టప్ల పేరుతో పెరుగుతున్న ఆన్లైన్ కార్యకలాపాల్లో భాగంగా 'గిగ్' ఎకానమీలో పెరుగుతున్న అసంఘటిత రంగాన్ని ఉపాధిగా చూపిస్తోంది కేంద్రంలో ఉన్న బిజెపి. నిరుద్యోగానికి ఇదే ప్రత్యామ్నాయమని చెబుతున్న నేతలు.. ఈ రంగంలో నెలకొన్న సమస్యల్ని, సవాళ్లను పరిష్కరించే దిశగా చేస్తున్న ప్రయత్నాలు మాత్రం శూన్యం. ఉద్యోగ భరోసా, ఆరోగ్య భద్రత లేని ఈ రంగంపై ప్రభుత్వానికి సరైన నియంత్రణ, కనీస కార్మిక చట్టాలు లేకపోవడం.. లక్షలాది యువత భవిష్యత్తు గాల్లో దీపంలా తయారైంది.
కార్మికుల కష్టంతో కాసులు..
ఇక ఇప్పటికే ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కార్మికుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్న కంపెనీలు.. వారికి కనీస భద్రత కల్పించడాన్ని విస్మరిస్తున్నాయి. వీరంతా కాంట్రాక్టు / తాత్కాలిక కార్మికులు. వీరికి నిర్ణీత ప్రదేశం, కార్యాలయం ఏమీ ఉండవు. విధులు నిర్వర్తించే సమయంలో కనీస వసతులైన మరుగుదొడ్లు ఉండవు. ఉద్యోగ భద్రత, అధికారిక గుర్తింపు, సెలవులు, పండుగలు వగైరా వంటివి అసలే ఉండవు. ఇక అనారోగ్యం పాలైతే పరిస్థితి మరింత దారుణం. వీరంతా.. ఏరోజు పనిచేస్తే ఆరోజే ఆదాయం. ఇలాంటి దుర్భర పరిస్థితులున్న ఈ రంగంపై అటు ప్రభుత్వం.. ఇటు ఆయా సంస్థలు దృష్టి సారించకుండా.. ఇదే నిరుద్యోగ సమస్యకు పరిష్కారమని చెప్పడం హాస్యాస్పదం. స్విగ్గి, జొమాటో, ఫుడ్ పాండా, ఉబర్ ఈట్స్, స్కూట్సీ, ఫ్రెష్ మెనూ వంటి వందల సంఖ్యలో ఉన్న సంస్థలు.. ఓలా, ఉబర్, ర్యాపిడో, మేరు, క్విక్ రైడ్, జుగ్నో, డ్రైవ్ యు, సవారి, మై టాక్సీ ఇండియా వంటి సంస్థల్లో.. ఇక అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో తదితర ఆన్లైన్ పోర్టల్ సంస్థల్లో పనిచేసే డెలివరీ బార్సు పరిస్థితి అత్యంత దయనీయం.
జీతాల్లో హెచ్చు తగ్గులు..

ఏ రంగంలోనైనా ఉద్యోగికి, కార్మికుడికి నెల / రోజువారీ వేతనాల్లో కొంత భరోసా ఉంటుంది. కానీ గిగ్ కార్మికుల పరిస్థితి అలా కాదు. వీరికి వచ్చే ఆర్డర్ల మీదే వీరి జీతభత్యాలు ఆధారపడి ఉంటాయి. ఏ రోజు ఎన్ని డెలివరీలు చేస్తే అంతే ఫలితం అన్నమాట. అందువల్ల వీరి జీతభత్యాల్లోనూ భారీ వ్యత్యాసాలు ఉంటాయి. 'కాటలిస్ట్ ఫండ్, కర్మలైఫ్' నిర్వహించిన ఓ సర్వేలో 88 శాతం గిగ్ కార్మికులు ప్రతి నెలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల సగంలోనే మొత్తం డబ్బు అయిపోతుంది. గృహ, ఇంధన ఖర్చులు పెరగడం వీరి ఇబ్బందుల్ని మరింత పెంచింది. సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది కార్మికులు తమ కుటుంబ అవసరాల కోసం రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగ స్వభావం కారణంగా సంస్థాగత రుణాన్ని పొందలేక పోతున్నామని తెలిపారు.
'పది నిమిషాల్లో డెలివరీ'తో కష్టాలు..
గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ కంపెనీల 'పది నిమిషాల డెలివరీ' మోడల్ చర్చనీయాంశంగా మారింది. కస్టమర్లకు నిర్ణీత సమయంలోగా, వేగంగా ఆర్డర్లను తీసుకెళ్లి అందించటంలో భాగంగా ఫుడ్, సరకుల డెలివరీ సంస్థలు ఈ విధానాన్ని తీసుకొచ్చాయి. నిమిషాల్లో డెలివరీని కస్టమర్లకు అందించటం కోసం డెలివరీ కార్మికులు వాహనాలపై వేగంగా వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంకోవైపు నిర్ణీత సమయంలోగా ఆర్డర్లను కస్టమర్లకు చేర్చకపోతే అందుకు వేతనాల్లో కోతలను ఎదుర్కోవాల్సిన దుస్థితి.
మృత్యువాతపై యూనియన్ల ఆందోళన..
కంపెనీల అత్యుత్సాహ హామీలపై గిగ్ వర్కర్స్ యూనియన్లు, ఫెడరేషన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 'తమ అంచనాల ప్రకారం గత రెండు, మూడు నెలల్లో దేశవ్యాప్తంగా 10 నుంచి 15 మంది కార్మికులు కంపెనీల తీరుతో ప్రాణాలు కోల్పోయారు. వీటికి ఫుడ్ డెలివరీ కంపెనీలు ఎందుకు బాధ్యత వహించవు?' అని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) జాతీయ ప్రధానకార్యదర్శి షేక్ సలావుద్దీన్ ప్రశ్నించారు.
'గిగ్ ప్లాట్ఫామ్లో వృద్ధి భారత శ్రామికశక్తిలో, అసంఘటిత రంగ ఆర్థికవ్యవస్థలో పెద్ద మార్పు. అయితే కార్మికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సమస్యలూ పెరిగే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్య యువత. వీళ్లకి కార్మికచట్టాలపై సరైన అవగాహన లేదు. దీన్ని అలుసుగా తీసుకుని కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అయితే గత నాలుగేళ్లుగా గిగ్ కార్మికుల కోసం మేము పోరాడుతున్నాం. వారి కోసం నిర్ణీత చట్టాలు చేయాలని ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించాం. కనీస వేతనం, ఆరోగ్య, ఉద్యోగ, సామాజిక భద్రత వంటి అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాం. దారుణమేమంటే.. వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు' అని సలావుద్దీన్ తెలిపారు.
సామాజిక భద్రత కరువు..

దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్, డెలివరీ సర్వీసుల్లో నిమగమైన గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కరువైంది. ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) భాగస్వామ్యంతో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) 'డిజిటల్ ప్లాట్ఫారమ్ ఎకానమీలో కార్మికుల భద్రత' పేరుతో ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో గిగ్ వర్కర్లలో పెద్ద సంఖ్యలో సామాజిక భద్రత లేదని వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న కార్మికులలో కేవలం 0.15 శాతం మంది మాత్రమే 'ప్రమాద బీమా'ను కలిగి ఉండటం గమనార్హం. వీరు కూడా తమ సొంతగా బీమా ప్రీమియం చెల్లించారని పేర్కొంది.
నీతి ఆయోగ్ ఏం చెబుతోంది..?
దేశంలో తాత్కాలిక కార్మికుల (గిగ్ వర్కర్ల) సంఖ్య 2029-30 కల్లా 2.35 కోట్లకు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. 2020-21లో ఈ సంఖ్య 77 లక్షలుగా ఉందని పేర్కొంది. ఈ తరహా కార్మికులు, వారి కుటుంబాలకు భాగస్వామ్య పద్ధతిలో సామాజిక భద్రతా చర్యల (వైద్యసేవలు, బీమా, పెన్షన్) ను అందించాలని సిఫారసు చేసింది. తాత్కాలిక కార్మికులను ప్లాట్ఫామ్ (ఆన్లైన్ యాప్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లపై పనిచేసేవాళ్లు), నాన్ ప్లాట్ఫామ్ (శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపదికన సంప్రదాయ రంగాల్లో పనిచేసే కార్మికులు) అని రెండు విభాగాలుగా వర్గీకరించారు. 'ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ' పేరుతో రూపొందిన ఈ నివేదిక ప్రకారం.. 2020-21లో రిటైల్ ట్రేడ్, విక్రయాల విభాగంలో 26.6 లక్షల మంది, రవాణా రంగంలో 13 లక్షల మంది, తయారీ రంగంలో 6.2 లక్షల మంది, ఆర్థిక సేవలు- బీమా రంగాల్లో 6.3 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. మధ్యతరహా నైపుణ్య ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు 47% మంది కాగా.. అధిక నైపుణ్య ఉద్యోగులు 22%, తక్కువ నైపుణ్య కార్మికులు 31 శాతంగా ఉన్నారని నివేదిక వివరించింది.

లేబర్కోడ్లతో ప్రభావం..
గతేడాది సెప్టెంబర్లో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ ఐఎప్ఏటీ భారత సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) వేసింది. ఈ పిటిషన్ విచారణకు అంగీకరించిన న్యాయస్థానం.. సామాజిక భద్రత గిగ్ కార్మికులతో సహా కార్మికుల హక్కు కాదా అని ప్రశ్నించింది. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లూ గిగ్ కార్మికులపై ప్రభావం చూపుతాయి. ఇందులో సామాజిక భద్రత కోడ్, 2020 (ఎస్ఎస్ కోడ్) కూడా ఉంది. ఇది అసంఘటిత కార్మికుల హక్కులను హరిస్తుంది.
కేరళలో సంక్షేమ నిధి..
జొమాటో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్.. మొదలైన కంపెనీల్లో డెలివరీ బార్సుగా (గిగ్ వర్కర్స్) పనిచేస్తున్నారు. కార్మికులకు, ఇతర సిబ్బందికి కేరళ ప్రభుత్వం ఒక 'సంక్షేమ నిధి'ని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెల్లడించింది. పని గంటలు, వేతనాలు, ఉద్యోగ భద్రత, మొదలైన అంశాల్లో కార్మికహక్కుల్ని కాపాడటానికి ప్రభుత్వపరంగా పటిష్ట చర్యలు చేపట్టింది. వేతనాలు, ఉద్యోగాల తొలగింపు వంటి అంశాలపై ఇప్పటికే యాజమాన్యాలతో మాట్లాడుతున్నట్లు ప్రకటించింది. దోపిడీకి గురవుతున్నామని ఆందోళన చెందుతున్న గిగ్ వర్కర్స్లో కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనోధైర్యాన్ని నింపుతుంది. తమ హక్కుల కోసం లేబర్ కోర్ట్ లేదా ఇండిస్టియల్ ట్రిబ్యునల్ను సంప్రదించవచ్చని రాష్ట్ర కార్మికమంత్రి వి శివన్కుట్టీ తెలిపారు.
కేస్-1

'నా పేరు సోమనాథ్. మాది గుంటూరు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. అయినా సరైన ఉద్యోగం పొందలేకపోయాను. దీంతో ఏంచేయాలో అర్థంకాలేదు. అప్పుడే బతుకుదెరువు కోసం డెలివరీ సర్వీస్లో చేరాను. మా కంపెనీలో నాకు ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు లేవు. కంపెనీ ఎప్పుడైనా మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగాంచాలనుకుంటే నోటీసు లేకుండా చేయవచ్చు. నేను కష్టమర్ సర్వీస్ విభాగంలో పనిచేశాను. కంపెనీ సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించినప్పుడు గంటల వ్యవధిలోనే సమాచారం అందిస్తుంది' అని వాపోయాడు.
కేస్-2

'పనుల్లేక నిర్మాణ రంగంలో పనిచేసే నాన్న ఉపాధి కోల్పోయారు. అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. నాకు స్కూల్కు వెళ్లే తమ్ముడు ఉన్నాడు. నేను ఇంటర్ పూర్తిచేశాను. డేటా ఎంట్రీ కోర్సు పూర్తిచేసి, ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అనుకున్నా. మా దగ్గర డబ్బు లేదు. దీంతో నేను పనిచేయాల్సి వచ్చింది. ఇంటి పక్కనే ఉండే అంకుల్ సలహాతో 'స్విగ్గీ'లో చేరాను. బైక్ కొనే ఆర్థిక పరిస్థితి లేదు. ఒక వేళ కొన్నా పెరిగిన పెట్రోల్ ధరలతో ఏమీ మిగలవు. ఒక ట్రిప్ వేస్తే వచ్చేది రూ.30. అందుకే సైకిల్పైనే డెలివరీ చేస్తున్నా. ఒక్కోసారి అనిపిస్తుంది ''జీవితంలో ఏం చేద్దామనుకున్నా.. ఏం చేస్తున్నా?'' అని' వాపోయారు విశాఖకు చెందిన హర్షిణి.
కేస్-3

'పనుల్లేక నిర్మాణ రంగంలో పనిచేసే నాన్న ఉపాధి కోల్పోయారు. అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. నాకు స్కూల్కు వెళ్లే తమ్ముడు ఉన్నాడు. నేను ఇంటర్ పూర్తిచేశాను. డేటా ఎంట్రీ కోర్సు పూర్తిచేసి, ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అనుకున్నా. మా దగ్గర డబ్బు లేదు. దీంతో నేను పనిచేయాల్సి వచ్చింది. ఇంటి పక్కనే ఉండే అంకుల్ సలహాతో 'స్విగ్గీ'లో చేరాను. బైక్ కొనే ఆర్థిక పరిస్థితి లేదు. ఒక వేళ కొన్నా పెరిగిన పెట్రోల్ ధరలతో ఏమీ మిగలవు. ఒక ట్రిప్ వేస్తే వచ్చేది రూ.30. అందుకే సైకిల్పైనే డెలివరీ చేస్తున్నా. ఒక్కోసారి అనిపిస్తుంది ''జీవితంలో ఏం చేద్దామనుకున్నా.. ఏం చేస్తున్నా?'' అని' వాపోయారు విశాఖకు చెందిన హర్షిణి.
ప్రస్తుతం యాప్ ఆధారిత వ్యవస్థ, పేలవమైన పని పరిస్థితులు. సామాజిక భద్రత, ప్రయోజనాలు లేకపోవడం. చట్టబద్ధంగా వారికి ఉద్యోగి హోదా కల్పించడంలో వైఫల్యాలం. ఇలాంటివి గిగ్ కార్మికులకు అతిపెద్ద ఆటంకాలుగా ఉన్నాయి. ఇక మహిళలు లింగ అధారిత అసమానతలు సైతం ఎదుర్కొంటున్నారు. గత నెలలో న్యూయార్క్ సిటీ కౌన్సిల్ గిగ్ ఎకానమీకి సంబంధించి ఆరు బిల్లులను ఆమోదించింది. వీటిల్లో గిగ్ కార్మికులు రెస్టారెంట్లలో బాత్రూమ్ సౌకర్యాలు పొందడం, డెలివరీ వర్కర్లు ఎంత సమయం అక్కడ వుండవచ్చు, కనీస వేతనాలు, ఎంతదూరం వరకూ డెలివరీ ప్రయాణం చేయాలి, బీమా సౌకర్యం, ప్రోత్సాహకాలు అందించడం వంటి అంశాలు ఉన్నాయి. భారత్లోనూ ఇలాంటి తరహా విధానాలను అమలు చేయాలి.
ఉదయ్ శంకర్ ఆకుల
7989726815