- గ్రాడ్యుయేషన్ డే లో పాంచజన్య శ్రీనివాసులు
ప్రజాశక్తి హిందూపురం(అనంతపురం) : పాంచజన్య పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం పాఠశాలలో ప్రీ ప్రైమరీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు, అకాడమిక్ డైరెక్టర్ నందిత, పాఠశాల సెక్రెటరీ నంద కుమార్, ప్రముఖ వైద్యులు సౌదీన్ రెడ్డి, చందనా దీప్తి, డిప్యూటీ తహశీల్దార్ ప్రసాద్, ఎఓ భాస్కర్, హెచ్ఎం గాయిత్రిల చేతుల మీదుగ మార్కుల మెమోతో పాటు ప్రతిభ కనబర్చిన మెరిట్ స్కాలర్ షిప్ను అందించారు. ఈ సందర్బంగా పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు, అకాడమిక్ డైరెక్టర్ నందిత మాట్లాడుతూ.. ఇప్పటికే పాఠశాలలో రాష్ట్ర, జాతీయ స్థాయికి అనుగుణంగా ప్రమాణాలను ఏర్పాటు చేసి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఉన్నత పాఠశాల విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. దీనికోసం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో అంతర్జాతీయ గుర్తింపు పొందిన వివిధ పాఠశాలలను పరిశీలన చేసి ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాల కన్న ఇంకా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందిస్తామన్నారు. విద్యకు పునాది ప్రాథమిక విద్య అన్నారు. ప్రాథమిక విద్య ధశలో మంచి క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించడంతో విద్యార్థి ఉన్నత విద్యకు పోయే సమయానికి మంచి క్రమశిక్షణతో ముందుకు పోవడానికి సాధ్యం అవుతుందన్నారు. అందుకోసమే ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నమన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎహెచ్ఎంలు శశికళ, సతీష్ కుమార్, అబ్దుల్ రజాక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.











