పలమనేరు (చిత్తూరు) : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోరుకు అందరూ సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ పలమనేర్ పట్టణ అధ్యక్షులు ఆర్.బి.సి. కుట్టీ సూచించారు. పలమనేరు టిడిపి కార్యాలయంలో శుక్రవారం పలమనేరు టౌన్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... బూత్ కమిటీ సభ్యులకు ఓటర్ లిస్ట్ పై పూర్తి అవగాహన ఉండాలన్నారు. హౌస్ మ్యాపింగ్, ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో బూత్ కమిటీ సభ్యులు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. నిత్యం ఓటర్ లిస్ట్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని పనిచేయనివారి విషయంలో మొహమాటలకు పోయేది ఉండదని వెంటనే వారిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. పనిచేయకపోతే స్వచ్ఛందంగా వైదొలిగి పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. ఓటర్ లిస్ట్ పై బూత్ సభ్యులకు అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకొని ఐక్యతతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కొత్త ఆదేశాల మేరకు జరిగే కార్యక్రమానికి బూత్ కమిటీ సభ్యులు తప్పక హాజరుకావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం గౌడు, చాంద్ భాష, గిరిబాబు, ఖాజాపీర్, నాగరాజు, మదన్, శ్రీధర్, సోమశేఖర్, కోటి, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.










