రాయదుర్గం (అనంతపురం) : కరోనా సమయంలో పనిచేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గంలో బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడవరోజు కొనసాగాయి. బుధవారం కార్మికులు అర్ధ నగంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తక్షణమే కరోనా మొదటి, రెండవ దశలలో పనిచేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పట్టణ జనాభాకు ఆనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్మికులకు న్యాయం జరిగే వరకూ దీక్షలను విరమింప చేసే ప్రసక్తే లేదని అవసరమైతే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి పర్యటనను సైతం అడ్డుకునేందుకు వెనకడుగు వేయమని హెచ్చరించారు.










