May 25,2023 12:52

ప్రజాశక్తి -భీమవరం(పశ్చిమగోదావరి) : భీమవరం పట్టణంలో వేలాపాల లేని విద్యుత్‌ కోతలను అరికట్టాలని సిపిఎం టౌన్‌ కార్యదర్శి బి.వాసుదేవరావు డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో ఇండిస్టియల్‌ ఏరియా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద విద్యుత్‌ కోతలు అరికట్టాలని కోరుతూ గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ప్రజలపై ట్రూ ఆఫ్‌ చార్జీలు పేరుతో విద్యుత్‌ భారాలు వేస్తున్నారని మండిపడ్డారు. కనీసం న్యాయమైన విద్యుత్తును సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. విద్యుత్‌ కోతల వల వృద్ధులు, చిన్నపిల్లలు ఉక్కపోతకు గురై అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కోతలను నివారించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కోతలను అరికట్టి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేసి ప్రజలను ఎండల నుండి కాపాడాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జక్కం శెట్టిసత్యనారాయణ, ఎం.వైకుంఠ రావు, ఎం.ఆంజనేయులు, చల్లబోయిన వెంకటేశ్వరరావు, యాకాబు పాల్గొన్నారు.