
ప్రజాశక్తి-క్రోసూరు : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి అనుకూలంగా వైసిపి, టిడిపి, జనసేన వ్యవహరించడం దుర్మార్గమని, ఈ పార్టీలను ప్రజలు నిలదీయాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్ అన్నారు. సిపిఎం పెదకూరపాడు నియోజకవర్గ విస్తృత సమావేశం మండల కేంద్రమైన క్రోసూరు ఆమంచి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. సమావేశానికి సిపిఎం అమరావతి మండల కార్యదర్శి బి.సూరిబాబు అధ్యక్షత వహించారు. విజయకుమార్ మాట్లాడుతూ అవకాశవాద పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం ప్రజా ప్రణాళికను రూపొందించిందని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా మూడు చోట్ల నుండి బస్సు యాత్రలు నిర్వహిస్తోందని తెలిపారు. ఒక యాత్ర 7వ తేదీన పల్నాడు జిల్లాకు వస్తుందని, సత్తెనపల్లిలో బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. దీంతోపాటు 15న విజయవాడలో జరిగి ప్రజారక్షణ భేరి బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విభజన హామీలు, రాజధాని, పోలవరం, కడప స్టీల్ప్లాంట్ల నిర్మాణాలను విస్మరించడంతోపాటు విశాఖ ఉక్కును అమ్మాలని చూడ్డం తెలుగు జాతిని మోసం చేయడమేనన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, నోట్ల రద్దు ద్వారా కోట్లాది మంది ఉపాధిని దెబ్బతీసిందని, మరోవైపు ప్రజల మధ్య కుల, మత ధ్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. బిజెపితోపాటు ఆ పార్టీకి వంతపాడే పార్టీలకూ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు మాట్లాడుతూ పెదకూరపాడు, క్రోసూరు మండలాల్లో సాగర్ అయకట్టు చివరి భూముల్లో వేలాది ఎకరాల్లో మిర్చి పైరుకు నీరందక ఎండిపోతోందని చెప్పారు. పొలాలకు సాగర్ నీరివ్వాలని, లేకుంటే పంట నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాభావంతో పత్తి దిగుబడి తగ్గుతుందని, ఈ క్రమంలో క్వింటాళ్ రూ.8 వేల మద్దతు ధరకు కొనాలని కోరారు. నియోజకవర్గంలోని సాగు భూములకు శాశ్వతంగా నీటి సదుపాయం కోసం పులిచింతల రిజర్వాయర్లోని బ్యాక్ వాటర్ను లిఫ్ట్ ద్వారా బెల్లంకొండ బ్రాంచ్ కెనాల్కు సరఫరా అయ్యేలా నిర్మాణం చేపట్టాలన్నారు. ఇసుక సామాన్య ప్రజలకు భారమైందని, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో సిపిఎం క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు మండల కార్యదర్శులు టి.హనుమంతరావు, ఆర్.వెంకటేశ్వర్లు, డి.శేషారావు, నాయకులు ఎ.ఆంజనేయులు, టి.కుమారి, జి.ఎలిశమ్మ, ఎన్.చిన్నమ్మాయి, ఎం.పౌలు, దుర్గారావు, సిహెచ్.యేసయ్య, ఎ.వెంకటేశ్వర్లు, జి.మహేష్, షేక్ ముస్తఫా, ఎస్.మోహనరావు, టి.చుక్కయ్య, ఎస్.సాంబయ్య, షేక్ మోహిదీన్, కె.యెషయ్య పాల్గొన్నారు.