Oct 30,2023 00:55

ధర్నా శిబిరం వద్ద మత్స్యకారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:తమకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని మత్స్యకారులు స్పష్టం చేసారు.హెటిరో కొత్త పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహాధర్నా 692వ రోజుకు చేరింది. ఆదివారం ధర్నా శిబిరం వద్ద మత్స్యకారులు పైపులైనుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొత్త పైపులైన్‌ వ్యతిరేకిస్తూ తామంతా 692 రోజుల నుండి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ, నేటి వరకు సమస్య పరిష్కారానికి మార్గం చూపక పోవడం దారుణమన్నారు. కంపెనీ వ్యర్ధ జలాలను సముద్రంలోకి వదలడంతో మత్స్య సంపద వృద్ధి చెందకపోవడంతో తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.కంపెనీ ఏర్పాటు చేయకముందు వేటకు వెళితే సమృద్ధిగా చేపలు పడేవని, వాటితో కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగించే వారమన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పైప్‌ లైన్‌ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు .ఈ కార్యక్రమంలో మత్స్యకారులు జి.సోమేశ్వరరావు, సిహెచ్‌ సోమేశ్‌, డి.నానాజీ, కె. భూలోక,కె.కాశీరావు తదితరులు పాల్గొన్నారు.