
ప్రజాశక్తి-అనకాపల్లి
విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 5న విశాఖపట్నం కూర్మన్నపాలెం జంక్షన్లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు. స్థానిక కార్మిక, కర్షక భవనంలో సోమవారం సిపిఎం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 1 ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉక్కు రక్షణ బైక్ యాత్ర చేసినట్లు చెప్పారు. స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడానికి సిపిఎం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 5న జరుగు బహిరంగ సభకు సిపిఎం అఖిలభారత ప్రదాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరౌతున్నారని, ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఎందరో పోరాటం, త్యాగాలు, 32 మంది బలిదానంతో ఏర్పడిన విశాఖ స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, ఎం.అప్పలరాజు, జిల్లా నాయకులు ఆర్.శంకరరావు, జి.శ్రీరామ్, వివి.శ్రీనివాసరావు, ఎ.బాలకృష్ణ, గనిశెట్టి సత్యనారాయణ, ఆర్.రాము, ఎ.రాజు, కె.గోవిందరావు, జి.దేముడు నాయుడు, కె.అప్పారావు, గండి నాయనబాబు, సాపిరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ సభ జయప్రదానికి ప్రచారం
అచ్యుతాపురం : విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు ఈ నెల 5న జరుగు భారీ బహిరంగ సభకు తరలిరావాలని కోరుతూ సిపిఎం అచ్చుతాపురం మండల కన్వీనర్ ఆర్.రాము కార్మికులతో సమావేశాలు నిర్వహించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు బాతు లాంటి విశాఖ ఉక్కును కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు ధారాదత్తం చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో రాజాన సత్తిబాబు, వెంకటరావు, ఈశ్వర్రావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బైక్ యాత్ర
మధురవాడ : విశాఖ ఉక్కు రక్షణ యాత్రలో భాగంగా కూర్మన్నపాలెంలో ఈ నెల 5వ తేదీన చేపట్టే బహిరంగసభను జయప్రదం చేయాలని సిపిఎం మధురవాడ జోన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోరుతూ చేపట్టిన ద్విచక్ర వాహన యాత్రను సోమవారం కొమ్మాది కూడలి వద్ద సిపిఎం మధురవాడ జోన్ కమిటీ నాయకులు బి భారతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర సాయిరాం కాలనీ రోడ్డు, కొమ్మాది ఎస్సి కాలనీ, కొమ్మాది విలేజి కె2, కె1, కె3 కాలనీలు, బక్కన్నపాలెం, పిఎం పాలెం ప్రధాన రహదారి, మీదుగా కార్ షెడ్ కూడలి, మధురవాడ వంతెన మీదుగా తిరిగి కొమ్మాది చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఎం మధురవాడ జోన్ కార్యదర్శి డి.అప్పలరాజు మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్ప్లాంట్ను కాపాడుకునే క్రమంలో చేపట్టిన యాత్ర ముగింపు సభకు సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతన్నారని, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.రాజ్కుమార్, జి.కిరణ్, గౌరీ, ఎస్.రామప్పడు, కె.సన్యాసిరావు, కె.పద్మ, కె.సుజాత, డి.కొండమ్మ, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.