
ప్రపంచంలో కరోనా మూడో అల తర్వాత పరిస్థితి అంతా సద్దుమణిగింది అని ఊపిరిపీల్చుకుంటున్న తరుణం.. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో మరోసారి కరోనా నాల్గో అల అలజడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. సాధారణ పరిస్థితుల్లో ఉన్న ప్రజానీకం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అన్నట్లు ప్రపంచంలోని చైనా, బ్రిటన్ దేశాల్లో కొత్త వేరియంట్లు హెచ్చరిస్తున్నాయి. ఐదురోజుల క్రితం మన దేశంలో మహారాష్ట్రలో కూడా ఈ కొత్త వేరియంట్ ఒక కేసు నమోదు కావడం మనల్ని కలవరపెడుతోంది. భయపడాల్సిన పనిలేదుగానీ, అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కథనం..
ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కరోనా వైరస్ పుట్టిన చైనాలోనే సరికొత్త కోవిడ్ వేరియంట్ విజృంభిస్తోంది. షాంఘై నగరం వైరస్తో భీతిల్లుతోంది. వైరస్ ఉధృతిని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం ఏకంగా సైన్యాన్నే రంగంలోకి దించింది. ప్రస్తుతం షాంఘైలో రెండు వేల మంది సైనిక వైద్య సిబ్బంది, పది వేల మంది ఆరోగ్య కార్యకర్తలు అహర్నిశలూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సుమారు రెండున్నర కోట్ల మందికి ప్రభుత్వం సామూహిక కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తోంది. ముందు జాగ్రత్తగా వారం కిందట లాక్డౌన్ విధించినప్పటికీ వైరస్ శరవేగంతో వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం భార్యాభర్తలను కూడా పక్కపక్కన పడుకోవద్దనే హెచ్చరికలను జారీ చేసింది. మొన్న జనవరిలో బ్రిటన్లో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు పదింతల శక్తితో ప్రపంచ ప్రజలపై విరుచుకుపడబోతున్నది. చైనాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఈ వైరస్ అన్నంత పనీ చేసేలా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ముప్పు మరోమారు తప్పదని చైనా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్లు బిఏ1, బిఏ2 నుంచి రూపాంతరం చెందిన ఈ వేరియంట్ని ఎక్స్ఈ (శజు) గా పేర్కొంటున్నారు. ముప్పేటా ముంచుకొస్తోన్న మహమ్మారి ప్రమాదంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ (ఔనఉ) అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తోంది.

మన దేశంలో..
మన దేశంలో గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుంటూ.. మానవజాతిని వణికిస్తూనే ఉంది. సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్, థర్డ్వేవ్లో ఒమిక్రాన్ వేరియంట్ల పేర్లతో కరోనా వైరస్ మానవ జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఇప్పుడిప్పుడే కరోనా థర్డ్వేవ్ నుంచి బయటపడుతూ.. జనం సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. భారత్లో గత కొద్ది రోజులుగా రోజువారీ కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. రోజువారీ నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య దరిదాపుగా 1,000కి తగ్గింది. దేశంలో కోవిడ్ మూడో దశ క్షీణించింది. మూడో వేవ్ తగ్గిందన్న ఆనందం ఒక పక్కన ఉంటే నాల్గో వేవ్ రాబోతోందన్న భయం మరో పక్క ప్రజల్ని వెంటాడుతోంది. ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనా నాల్గో వేవ్ జూన్ 22 నాటికి ప్రారంభమవుతుందని తాజా పరిశోధనలు అంచనా వేస్తున్నాయి. నాల్గో వేవ్.. నాలుగు నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేశారు. అయితే నాల్గో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్స్ ఆవిర్బావం, బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ తీసుకున్న వారి శాతం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. నాల్గో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని, అక్టోబర్ 24 వరకూ కోవిడ్ నాల్గో వేవ్ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయని తెలిపారు. దేశంలో కోవిడ్ వేవ్లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్ అంచాల విషయంలో కొద్ది రోజుల తేడాతో దాదాపు కచ్చితమైన అంచనా వేశారు.

కాన్పూర్ అంచనా..
ఐఐటీ కాన్పూర్ గణితం, గణాంకాల విభాగానికి చెందిన సబర పర్షద్ రాజేష్భారు, సుభ్ర శంకర్ధర్, శలభ్ ఈ పరిశోధనలను నిర్వహించారు. 2020 జనవరి 30 దేశంలో అధికారికంగా మొట్టమొదట నమోదైన తేదీ నుండి 936 రోజుల తర్వాత మనదేశంలో నాల్గో వేవ్ రావచ్చని ఈ బృందం తెలిపింది. 'నాల్గో వేవ్ జూన్ 22 నుండి ప్రారంభమవుతుంది. ఆగస్టు 23న గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అక్టోబర్ 24 తేదీతో ఈ అల ముగుస్తుంది' అని వారు చెప్పారు. జింబాబ్వే డేటా ఆధారంగా గాస్సియన్ డిస్ట్రిబ్యూషన్ మిశ్రమం యొక్క భావనను ఉపయోగించి మనదేశంలో థర్డ్వేవ్ అంచనా వేయబడింది. మనదేశంలో మూడో వేవ్ రావడం, పోవడం అనుభవాలను చూసినప్పుడు ఈ సూచన దాదాపు సరైనదని స్పష్టమైంది. 'ఆ అధ్యయనం ద్వారా ప్రేరేపించబడిన మేము నాలుగో వేవ్ అంచనాను పరిశోధించాం' అని పరిశోధకులు తెలిపారు. ఈ లెక్కల, తేదీల వెనుక వున్న మర్మమేమిటన్నది స్పష్టంగా తెలియకపోయినా, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా, సాధ్యం కాకపోయినా, మూడో వేవ్పై వారు ఇచ్చిన సమాచార అనుభవాన్ని బట్టి నాల్గో వేవ్ గురించి మనం తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రఖ్యాత వైరాలజిస్ట్, మాజీ ప్రొఫెసర్, సిఎంసి వెల్లూరుకు చెందిన డాక్టర్ టి. జాకోబ్ జాన్ దేశ ప్రజలకు సంతోషకరమైన వార్తను చెప్పారు. దేశంలో కోవిడ్-19 నాల్గో వేవ్ ఉండకపోవచ్చని అన్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఱషఎతీ) కి చెందిన వైరాలజీ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్కు గతంలో డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ టి జాకబ్ జాన్ 'పీటీఐ' వార్తాసంస్థతో మాట్లాడుతూ పలు కీలకాంశాలను వెల్లడించారు. భారతదేశంలో కోవిడ్ థర్డ్వేవ్ ముగిసిందని.. పూర్తిగా భిన్నమైన వేరియంట్ వస్తే తప్ప దేశంలో నాల్గో వేవ్ ఏర్పడదని పేర్కొంటున్నారు. ఆల్ఫా, బీటా, గామా, ఒమిక్రాన్ రకాలకు భిన్నంగా వ్యవహరించే కొత్త వేరియంట్ ఏదైనా పుట్టుకొస్తే తప్ప, నాల్గో వేవ్ దేశంలో రాదని ధీమా వ్యక్తం చేశారు. నాల్గో కోవిడ్ తరంగాలను అంచనా వేయడానికి శాస్త్రీయ, ఎపిడెమియోలాజికల్, వైరోలాజికల్ కారణాలేమీ లేవని, అయితే వచ్చే అవకాశం లేదని కూడా ఎవరూ ఊహించలేరని చెప్పారు.

మహారాష్ట్రలో కొత్త వేరియంట్ కలకలం..
ఐదు రోజుల క్రితం మన దేశంలో కరోనా కొత్త వేరియంటు కనుగొనబడింది. ముంబైలోని పౌర సంస్థ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (దీవీజ) బుధవారం నగరంలో కరోనా వైరస్ కొత్త ఎక్స్ఈ (శజు) వేరియంట్ కేసు కనుగొనబడిందని పేర్కొంది. అయితే, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మాత్రం ఆ రోగి నమూనా జీనోమ్ సీక్వెన్సింగ్ ఎక్స్్ఈ వేరియంట్ ఉనికిని సూచించడం లేదని చెప్పింది. కొత్త వేరియంట్ ఎక్స్ఈ అనేది ఒమిక్రాన్-బిఎ.1, బిఎ.2 రెండు వేరియంట్ల ఉత్పరివర్తన హైబ్రీడ్. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో కొద్ది భాగానికి మాత్రమే కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఈ కొత్త మ్యుటేషన్ యొక్క వ్యాపన శక్తి బిఎ.2 సబ్-వేరియంట్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా వుందట. ఇప్పటి వరకూ ఒమిక్రాన్ బిఎ.2 సబ్-వేరియంట్ కోవిడ్-19 అత్యంత అంటువ్యాధిగా పరిగణించబడింది. బ్రిటన్లో జనవరి 19న తొలి ఎక్స్ఈ కేసు నమోదైంది. కొత్త వేరియంట్ వస్తే నాల్గో వేవ్ వచ్చే అవకాశం ఉందని భయడుతున్న ఈ సందర్భంలో ఈ కొత్త వేరియంట్ మీద స్పష్టత లేకపోవడంతో ప్రజలు మరింత భయ భ్రాంతులకు గురికావాల్సి వస్తుంది.

అంతకుముందు బీఎంసీ ఏం చెప్పిందంటే..?
బీఎంసీ ప్రకారం.. ఎక్స్ఈ వేరియంట్ అనుమానిత వ్యక్తి వృత్తిరీత్యా కాస్ట్యూమ్ డిజైనర్. ఫిబ్రవరి 10, 2022న దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. భారతదేశానికి చేరుకున్న తర్వాత, ఆమె కోవిడ్-19కి ప్రతికూలంగా పరీక్షించబడింది. అయితే 2022 మార్చి 2న, సాధారణ పరీక్షల సమయంలో ఆమె పాజిటివ్గా ఉన్నట్లు కనుగొనబడింది. ఆ తర్వాత ముంబై సబర్బన్ బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్లో ఆమెను క్వారంటైన్ చేశారు.

ప్రస్తుత బ్రిటన్ పరిస్థితి
కోవిడ్ ప్రభావంతో విలవిల్లాడి కోవిడ్ నిబంధనలను సరళించుకుని, మాస్క్ ధరించడం కూడా ప్రజల ఇష్టానికే వదిలేసిన బ్రిటన్లో మరోసారి ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ 2 ఇప్పుడు బ్రిటన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. గత వారం బ్రిటన్లో 49 లక్షల మంది వైరస్ బారినపడినట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించాయి. గతవారం రోజుల్లో దేశంలోని ప్రతి 13 మందిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. ఇక, అంతకుముందు వారం 43 లక్షల మందికి కోవిడ్ సోకింది. తాజా పరిణామాలకు ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అమ్మో కరోనా 4వ వేవ్ వచ్చేస్తుందని భయపడిపోవద్దు.. అదే సందర్భంలో మూడో వేవ్ అంతమైందిలే అని కోవిడ్ నివారణ చర్యలు తీసుకోవడంలో అలసత్వం చేయకూడదు. ధైర్యంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నాల్గో వేవ్ రాకుండా చేసుకోవచ్చు. కొన్ని కేసులు వచ్చినా దానికి తగిన వైద్యం చేయడం ప్రస్తుతం సులభమే. ఎందుకంటే రెండో వేవ్లో వచ్చినటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వచ్చినటువంటి అనుభవాలు, అవసరమైన వైద్య సదుపాయాలన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. అదేవిధంగా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకుందాం. అవకాశం ఉన్న వారందరం వ్యాక్సిన్ వేయించుకుందాం. కరోనా నాలుగో వేవ్ను రాకుండా చూసుకుందాం.

రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వ్యాక్సిన్ వేయించుకోడానికి అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ కరోనాని పూర్తిగా నివారించలేక పోవచ్చు. కానీ కోవిడ్ సోకినప్పటికీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని మూడో కరోనా అలలో రుజువు అయ్యింది. 12 సంవత్సరాలు పైబడిన వయస్సు ఉన్న వారికందరికీ టీకాలు వేస్తున్నారు. 5 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి కూడా వ్యాక్సిన్ వేసే ప్రయత్నం త్వరితగతిన చేయాలి.

- మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ఈ మాస్క్ కరోనాని నివారించడమే కాకుండా ఈ వ్యాధి వ్యాప్తిని చాలావరకూ తగ్గిస్తుంది. సామాజికంగా మాస్క్ వాడడం ప్రారంభించినప్పటి నుంచి అనేక రకాలైన శ్వాసకోశ అంటువ్యాధులు తగ్గిపోయాయి.
- భౌతికదూరం పాటించడం. గుంపులుగా చేరకపోవడం వంటివి ఆచరించడం కష్టమైనప్పటికీ వీలైనంత వరకూ భౌతికదూరాన్ని పాటించగలిగితే మంచిది. దూరంగా ఉండడం సాధ్యం కాని పరిస్థితుల్లో మూతికి మాస్క్ వేసుకోవడం తప్పనిసరి చేయాలి.
- మరో కరోనా వేవ్ వస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తనవంతుగా తీసుకోవలసిన బాధ్యతలన్నీ తీసుకోవాలి. కరోనా తగ్గిందని టెస్టులు సంఖ్యని విపరీతంగా తగ్గించడంలాంటివి చేయకుండా టెస్ట్లు అందుబాటులో ఉంచడం అనేది చాలా ముఖ్యం. వచ్చే కొత్త కొత్త వేరియంట్లను త్వరగా కనుక్కోవడానికి ముఖ్యమైనటువంటి జీనోమిక్ సీక్వెన్స్ స్టడీని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా కొనసాగించాలి. మరో వేవ్ వస్తే ప్రజలందరికీ ఉచిత వైద్యం అందుబాటులో ఉండే విధంగా కోవిడ్ వైద్యానికి అవసరమైన మందులను, ఆక్సిజన్, మంచాలను నిత్యం అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. విదేశీ పర్యటన విషయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా అమలు చేయాలి. 5-12 సంవత్సరాల మధ్య వయస్సు వారికి కూడా కరోనా వ్యాక్సిన్ వేసే ప్రయత్నం చేయాలి. 12 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పూర్తిచేయాలి.

- వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, ఊబకాయం, మధుమేహం, ధూమపానం లాంటి అలవాట్లు ఉన్నవారికి కరోనా సోకితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధినిరోధక శక్తిని పెంచే విధంగా ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, రోజుకు కనీసం ఆరు గంటలు నిద్ర ఉండేటట్టుగా చూసుకోవడం చేయాలి. మధుపానం, ధూమపానం లాంటి అలవాట్లను పూర్తిగా మానేయడంలాంటివి చేస్తే కరోనా వచ్చినా వ్యాధి తీవ్రతను తగ్గించుకుని బయటపడే అవకాశం ఉంటుంది.

ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్