
ప్రజాశక్తి-అనకాపల్లి:కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గద్దె దింపాలని, బిజెపికి వత్తాసు పలుకుతున్న రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేనలను ఓడించాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. అనకాపల్లిలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక సంయుక్తాధ్వర్యంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజధానిలో నవంబర్ 27, 28 తేదీల్లో నిర్వహించే మహా పడావ్పై ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా పడావ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షకుల హక్కులను కాలరాసి కొంతమంది పెట్టుబడిదారులకు దేశ సంపదను కట్టబెట్టాలని చూస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని గద్దె దించకుంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేసి మనువాద రాజ్యాంగాన్ని అమలు పరిచే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ తెచ్చిన మూడు నల్ల రైతు వ్యతిరేక చట్టాలను, లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో 13 నెలలపాటు జరిగిన మహా పోరాటాన్ని గుర్తుచేశారు. ఆ సమయంలో మోడీ ప్రభుత్వం దిగొచ్చి నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. అదే సమయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన గిట్టుబాటు ధర చట్టం తెస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదన్నారు. 1995 నుంచి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో మూడు లక్షలా 65 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ప్రజలపై పన్నుల భారాలు మోపి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను గుంజారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం రైతుల పక్షాన కాకుండా కార్పొరేట్ సంస్థలకు చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాల రాస్తున్నారని, పత్రికా రంగంపై దాడులు నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో సహకార రంగంలో నడుస్తున్న నాలుగు సుగర్ ఫ్యాక్టరీల్లో మూడింటిని మూసివేయడం దారుణమన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై అందరికీ తెలియజేయాలన్నారు. తద్వారా రానున్న ఎన్నికల్లో బిజెపి, దాన్ని బలపరుస్తున్న పార్టీలను ఓడించాలన్నారు. ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.శంకరరావు, జి.కోటేశ్వరరావు, ఎఐటియుసి జిల్లా కన్వీనర్ వైఎన్.భద్రం, ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, ఎపి చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి అప్పారావు, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ బాలు, రైతు సంఘం నాయకులు ఆర్.అప్పలరాజు పాల్గొన్నారు.