Apr 12,2023 22:29

ఈబీసీ నేస్తం మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

         అనంతపురం కలెక్టరేట్‌ : 45 ఏళ్లు దాటిన అగ్రవర్ణ పేద మహిళలకు ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం రూ.15 వేల ఆర్థిక సహాయం అందించే ఈబీసీ నేస్తం రెండవ విడత నగదు బదిలీ కార్యక్రమం బుధవారం స్థానిక కలెక్టరేట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ లో నిర్వహించారు. లబ్ధిదారులకు కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈబీసీ నేస్తం రెండవ విడత ద్వారా జిల్లాలో 21,539 మందికి రూ.32.31కోట్ల రూపాయలు నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రస్తుతం లబ్ధిదారుల జాబితాలో లేని అర్హులు స్థానిక సచివాలయం, వాలంటీరు ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ కోగటం విజయ భాస్కర్‌ రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు ఛైర్‌పర్సన్‌ లిఖిత, రజక కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ మీసాల రంగన్న, ఆర్టీసీ రీజనల్‌ ఛైర్‌పర్సన్‌ మంజుల, నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ హరిత, వక్ఫ్‌ బోర్డు ఛైర్‌పర్సన్‌ రిజ్వాన్‌, బీసీ కార్పొరేషన్‌ ఈడీ నాగముని, జిల్లా బీసీ సాధికార, సంక్షేమ అధికారి ఖుష్బు కొఠారితో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.