15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు
స్టాండింగ్ కమిటీ తీర్మానం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
చిత్తూరు నగరపాలక స్టాండింగ్ కమిటీ సమావేశం నగర మేయర్ ఎస్.అముద అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం జరిగింది. సమావేశంలో నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆర్.చంద్రశేఖర్, ఆర్.జి శ్రీకాంత్, బి.పూర్ణచంద్రరావు, సి.శోభ, ఎ.జి సహదేవున్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధులతో సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాలువలు, జిఐ పైపులు, నీటి ఫిల్టరేషన్ ప్లాంట్లో యంత్రాలు, రసాయనాల కొనుగోళ్లకు సంబంధించిన పనులకు, సాధారణ నిధులతో సిమెంట్ రోడ్లు, నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె, చెప్పులు కొనుగోలుకు కమిటీ సభ్యులు ఆమోదించారు. ప్రధాన రహదారి నుండి శేషాపురంకు బిటీ రోడ్డు వేయడానికి కమిటీ ఆమోద ముద్ర వేసింది. నగరపాలక సంస్థ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరాన్ని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవడానికి వీలుగా రుసుము నిర్ణయిస్తూ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ గోవర్థన్, ఎంఈ ధనలక్ష్మీ, ఏసీపీ రామకష్ణుడు, డీఈలు రమణ, వెంకట ప్రసాద్, మేనేజర్ ఉమా మహేశ్వర్ రెడ్డి, ఎంఈలు పాల్గొన్నారు.










