- 140 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల) : పర్చూరు మండలం, ఇనగల్లులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. రెండు మినీ వాహనాల్లో తరలిస్తున్న బియ్యాన్ని రహస్య సమాచారంతో ఛేదించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో 140 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని చెరుకూరు తదితర రేషన్ దుకాణాల నుండి ఈ బియ్యాన్ని సేకరించినట్లు అధికారులు తెలిపారు. రెండు వాహనాలను సీజ్ చేసి ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. పదేపదే అక్రమాలకు పాల్పడుతున్న వారిపై పిడి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.










