Oct 26,2023 23:55

వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డిఇఒ వెంకటలక్ష్మమ్మ, జెవివి నేతలు

ప్రజాశక్తి-అనకాపల్లి
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నవంబర్‌ 10వ తేదీ నుండి 2024 జనవరి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.త్రిమూర్తులు తెలిపారు. చెకుముకి సైన్స్‌ సంబరాల గోడపత్రికను గురువారం అనకాపల్లిలో జరిగిన మండల విద్యాధికారుల సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి వెంకట లక్ష్మమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ విద్యార్థుల్లో సైంటిఫిక్‌ టెంపర్‌ని పెంచేందుకు జనవిజ్ఞాన వేదిక అనేక సంవత్సరాలుగా చెకుముకి సైన్స్‌ సంబరాలు నిర్వహిస్తుందన్నారు. సంబరాలు నిర్వహణ కోసం రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. చెకుముకి సంబరాలు జయప్రదంగా నిర్వహించేలా ఉపాధ్యా యులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, సహకరించాలని ఆయన కోరారు. చెకుముకి సైన్స్‌ సంబరాలు సందర్భంగా నవంబరు 10వ తేదీన పాఠశాల స్థాయిలోనూ, నవంబర్‌ 30న మండల స్థాయిలోనూ, డిసెంబరు 17న జిల్లా స్థాయిలోనూ, 2024 జనవరి 27, 28 తేదీలలో రాష్ట్రస్థాయిలోనూ సైన్స్‌ ప్రతిభాపాటవ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీలలో 8, 9 ,10 తరగతులు చదువుతున్న విద్యార్థులు పాల్గొనడానికి అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక అనకాపల్లి జిల్లా కోశాధికారి బి.ఉమామహేశ్వరరావు, జిల్లాలోని ఎంఇఒలు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్‌ పర్సన్స్‌ పాల్గొన్నారు.