Jun 26,2022 22:50

కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిది: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ వర్కర్ల జులై 10వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు సిఐటియు అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వాడ గంగరాజు, చైతన్యలు పేర్కొన్నారు. ఈమేరకు వారు సమ్మె నోటీసును మున్సిపల్‌ కమిషనర్‌కు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మునిసిపల్‌ కార్మికులకు నెలకు రూ.21000లు కనీసవేతనం ఇవ్వాలని, హెల్త్‌ అలవెన్స్‌ రూ.6000లు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే గత నాలుగు సంవత్సరాలుగా ఇవ్వాల్సిన యూనిఫామ్‌, సబ్బులు, నూనె, చెప్పులు ఇవ్వాలని, ఈఎస్‌ఐ కార్డు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర యూనియన్ల జెఏసి నిర్ణయం మేరకు జూలై 10 అర్ధరాత్రి నుండి కుప్పంలో సీఐటీయూ అనుబంధ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్మికులు సమ్మె చేయాలని యూనియన్‌ అధ్యక్షుడు గోవిందరాజు అధ్యక్షతన జరిగిన కార్మికుల సర్వసభ్య సమావేశం తీర్మానం చేసి సమ్మె నోటీసును మునిసిపల్‌ కమిషనర్‌ రవిరెడ్డికి అందజేశారు. యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శి గోవిందరాజు, పార్తిభన్‌, నరసింహులు, మంజుల, హేమవతి, గుణశేఖర్‌లు పాల్గొన్నారు.