ప్రజాశక్తి-రాజవొమ్మంగి
యువత చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలని రాజవొమ్మంగి ఎస్సై టీజీ నరేంద్ర ప్రసాద్ అన్నారు. మండలంలోని ఎస్.వనక రాయి గ్రామానికి చెందిన యువతకు రాజవొమ్మంగి ఎస్ఐ ఆధ్వర్యాన బుధవారం వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలకు సెలవుల కారణంగా విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, బెట్టింగులు, అసాంఘిక కార్యకలాపాలకు, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందించుకోవచ్చని చెప్పారు. గ్రామాలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వేసవికాలంలో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా వారిలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు వాలీబాల్ కిట్లు, ఇతర క్రీడా సామాగ్రి అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువత పాల్గొన్నారు.










