ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా యువతకు అవగాహన కల్పించేందుకు శనివారం విజయనగరంలో నిర్వహించిన జిల్లా స్థాయి మారథాన్ ఉత్సాహంగా సాగింది. విజ్జీ స్టేడియం వద్ద జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, క్షయ నివారణాధికారి డాక్టర్ సూర్యనారాయణ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా జిల్లా పర్యవేక్షకులు ఎన్.సాక్షి గోపాలరావు.. మారథాన్ ప్రాముఖ్యత వివరించారు. ఈ రెడ్రన్ మారథాన్ పోటీలలో పి.సాయి, ఎస్.అశోక్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వీరికి రూ.10 వేలు, రూ.7 వేలు చొప్పున నగదు బహుమతులు అందించారు. మరో ఏడుగురు విద్యార్థులు కూడా రూ.వెయ్యి చొప్పున బహుమతి గెలుచుకున్నారు. గెలుపొందిన పది మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఒ జి.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.










