ప్రజాశక్తి- శృంగవరపుకోట : రాజీయే రాజమార్గమని, కోర్టు కేసులో రాజీ చేసుకున్న కక్షిదారులు ఇద్దరూ విజయం సాధించినట్టేనని ఎస్.కోట జూనియర్ సివిల్ జడ్జి సబ్బవరపు వాణి అన్నారు. ఎస్.కోట కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1153 కేసులను న్యాయమూర్తి వాణి పరిష్కరించారు. ముందుగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ కేసులతో పాటు మనోవర్తి వంటి కేసులు పరిష్కరించేందుకు కక్షిదారులు ముందుకు రావాలని కోరారు. లోక్ అదాలత్ ద్వారా ఇచ్చిన తీర్పులకు అప్పీలు చేసుకునే అధికారం లేదని వివరించారు. అందువల్ల కక్షిదారులు, అర్జీదారులు ఈ సదవకాశాన్ని ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లు సత్యాజీ, ఎపిపి పప్పు కేశవరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనలు మేరకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్ వల్ల కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసులను సులువుగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి డబ్ల్యుఎన్శర్మ, న్యాయవాదులు ఎం.దుర్గాప్రసాద్, టివి సన్యాసిరావు, బి.త్రిమూర్తులు, మామిడి చంద్రశేఖర్, వారాది ఈశ్వరరావు, జి.చిట్టిబాబు, బివిఎస్ రామారావు, ఆర్.సత్యనారాయణ, టివిఆర్ మూర్తి, ఎం.అప్పారావు, బి.సత్యనారాయణ, బి.వెంకటరావు, సంతోష్, సిఐ బాల సూర్యారావు, ఎస్.ఐ తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










