ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రజా సంక్షేమ పథకాలతో పాటు, ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని నగర మేయర్ విజయలక్ష్మి పునరుద్ఘాటించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో టిడ్కోఇళ్ల లబ్ధిదారులకు రిజిస్టర్ డాక్యుమెంట్లను అందజేశారు. అనివార్య కారణాల వల్ల కొంతమంది లబ్ధిదారులకు డాక్యుమెంట్లను అందించలేక పోవడంతో శనివారం 243 మందికి డాక్యుమెంట్లను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పేదవారి ఇంటికలను నిజం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను అందజేస్తున్న విషయం తెలిసిందే అన్నారు. లబ్ధిదారులకు గహాలు అందజేయడంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సదుపాయాలు కల్పించకుండా లబ్ధిదారులను అయోమయంలో ముంచారని అన్నారు. ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి స్థానికంగా ప్రత్యేక శ్రద్ధ కనపరచి లబ్ధిదారులకు అనువుగా ఉండే విధంగా అన్ని సౌకర్యాలను మెరుగుపరిచారని చెప్పారు. శ్రావణమాసం నేపథ్యంలో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ లయ యాదవ్, ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్, సహాయ కమిషనర్ ప్రసాదరావు, కార్పొరేటర్లు బండారు ఆనందరావు, అల్లు చాణక్య, ఆల్తి సత్యకుమారి, తదితరులు పాల్గొన్నారు.










