ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పాలసీదారులకు నమ్మకమైన, మెరుగైన సేవలు అందించడంలో ఎల్ఐసి ముందంజలో ఉందని రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు అన్నారు. 67వ జీవిత బీమా వారోత్సవాలను శుక్రవారం ఆయన విజయనగరం బ్రాంచ్ కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్రావు మాట్లాడుతూ ఒక సేవా సంస్థ మాదిరిగా పాలసీదారుల సంక్షేమం కోసం ఎల్ఐసి నిరంతరం కృషి చేస్తుందని కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పాలసీదారుల పక్షాన రక్షణ కవచంగా నిలిచి ఎక్కడా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు అండగా నిలిచిందని చెప్పారు. ఎటువంటి ఆరోపణలకు తావులేకుండా డెత్ క్లైమ్లను సకాలంలో పరిష్కరించిన ఘనత ఎల్ఐసి దేనని అన్నారు. అందరి సహకారంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థగా గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్.నారాయణరావు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అంజయ్య, ఎఒ కట్టమూరి భాస్కర రామమూర్తి, జీవిత బీమా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి. శ్రీనివాసరావు, సీనియర్ డవలప్ మెంట్ ఆఫీసర్లు జి.రవిశ్రీనివాస్, ఎంఎల్ శ్రీనివాస్, జెవి నాగరాజు , సునీల్ కుమార్ రతో, ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు చిల్లా రామకృష్ణ, కార్యదర్శి ఇల్లాపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










