నాయుడుకాలనీలో పర్యటిస్తున్న కమిషనర్
ప్రజాశక్తి-బొబ్బిలి : పట్టణంలోని నాయుడుకాలనీలో కొన్ని ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కాలువలు నిర్మించాలని కాలనీ ప్రజలు మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావును కోరారు. నాయుడు కాలనీలో గురువారం కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువలు లేకపోవడంతో మురుగునీరు, వరదనీరు ఇళ్ల ముందు నిల్వ ఉంటోందని స్థానికులు వాపోయారు. నిధులు కేటాయించి కాలువలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీనిచ్చారు. కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టాలని, కాలువలు, రోడ్లు శుభ్రం చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ శివను ఆదేశించారు.










