Sep 05,2023 21:35

నెల్లిమర్ల: రాధాకృష్ణన్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌

జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులును ప్రజాప్రతినిధులు, అధికారులు సత్కరించారు. ఈ సందర్భంగా పిల్లలకు పలు క్రీడా పోటీలను నిర్వహించి గెలిపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కాగా టీచర్స్‌ డే సందర్భంగా పిల్లలు కట్టుకున్న వస్త్రధారణలు ఆకట్టుకున్నాయి..
ప్రజాశక్తి- చీపురపల్లి: 
స్థానిక రవీంద్రభారతి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని
ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల చైర్మన్‌ యంయస్‌ మణి, జోనల్‌ ఇంఛార్జి ఎన్‌.వెంకటేష్‌, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జి.అగ్రహారం ఎంపియుపి పాఠశాల ఆవరణలో ఆశయ యూత్‌ అసోసియేషన్‌, ప్రజా గ్రంథాలయం ఆధ్వర్యంలో రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ, ఇంచార్జి ఉపాధ్యాయులు అచ్చెన్నాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రేగిడి: మండలంలోని ఉంగరాడ మెట్ట పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ ఈ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు, ఉపాధ్యాయులు దినోత్సవం సందర్భంగా విశ్రాంతి గురువులను సత్కరించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, ఎంఇలు ప్రసాద్‌ రావు, ఎరకయ్య, ఎపిటిఎఫ్‌, యుటిఎఫ్‌, ఎస్‌సి, ఎస్‌టి టీచర్స్‌ ఫెడరేషన్‌ తదితర సంఘాల ప్రతినిధులు ఉపాధ్యాయులు, ఎఎస్‌ఐ రాజారావు, పోలీస్‌ సిబ్బంది శివ, సచివాలయ మహిళా పోలీసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాడంగి: స్థానిక జెడ్‌పి పాఠశాలలో హెచ్‌ఎం సత్యన్నారాయణను, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబర్చిని విద్యార్థులను, పీడీ బంగారునాయుడును విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విదార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: నగర పంచాయతీలో శ్రీ ఆదిత్య విద్యాలయం, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అలుగోలు, రామతీర్థం, జడ్పి ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆదిత్యా విద్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకర్రావు పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ను పాఠశాల యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల డిసిసిబి మేనేజర్‌ హరికేశవరరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సిహెచ్‌ ఆనందమూర్తి, అలుగోలు, రామతీర్థం జడ్పి ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు జి.ఎస్‌.కాంతారావు, ఎస్‌ఆర్‌ఎల్‌ శాస్త్రి ఇతర సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సెంచూరియన్‌ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి. పల్లవి అన్నారు. మంగళవారం సెంచూరియన్‌ విశ్వ విద్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రొఫెసర్‌ శాంతమ్మను రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పల్లవి చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ అధ్యాపక బృందం పాల్గొంది.
శృంగవరపుకోట: గురుపూజోత్సవం సందర్భంగా మండలంలోని పలు పాఠశాలలోను, కార్యాలయాలలోను గురువులను పూజిస్తూ సన్మానాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని నారాయణాస్‌ కేంబ్రిడ్జ్‌ పాఠశాలలో ఉపాద్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ పివిఎస్‌ఎస్‌ విశ్వనాధం, డీన్‌ తిరుపరిరావు, ఏ.జి.యం.శ్రీనివాసరావు, పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు గురువులను సన్మానించి పూజించారు. ధర్మవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురుపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కొత్తవలస: కొత్తవలస, దెందేరు, వియ్యంపేట కంటకాపల్లి హైస్కూల్లో, రవీంద్ర భారతి పాఠశాలలో, మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కంటకాపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యులు వి.అరుణకుమార్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తవలస మండల కార్యాలయం సమావేశ భవనంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ ఆధ్వర్యంలో 6 గురు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేతులు మీదుగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఎన్‌ శ్రీదేవి, కొప్పలవెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్‌.నాయుడుబాబు, పిఎసి చైర్మన్‌ గొరపల్లి శివ పాల్గొన్నారు.
లక్కవరపుకోట: సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రంలో ఉన్న శ్రీచైతన్య ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు విద్యార్థులు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడలలో గెలుపొందిన విజేతలకు విద్యార్థులు జ్ఞాపికలను బహుకరించారు. వారి వారి తరగతి టీచర్ల మాదిరి వేషధారణతో ఉపాధ్యాయ అవతారమేత్తి వారు బోధించే విధానాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్‌ వెంకటరమణ, కరాటే శిక్షకులు రాజు మాస్టర్‌, ఉపాధ్యాయులు డి రామసత్యం, ఎస్‌ ప్రదీప్‌, ఎస్‌ హారిక, తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీవేణుగోపాల మున్సిపల్‌ పాఠశాల, సంస్థానం పాఠశాల, శ్రీచైతన్య విద్యా నికేతన్‌, అభ్యుదయ పాఠశాల, విజేత స్కూల్‌, వాసు, సత్యసాయి, తాండ్రపాపరాయ, గాయత్రీ, విద్వాన్‌ జూనియర్‌ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
భోగాపురం: స్థానిక అవంతి రీసెర్చ్‌, టెక్నాలజికల్‌ అకాడమీలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెఎన్‌టియు గురజాడ ప్రిన్సిపాల్‌ డాక్టర కుమార్‌ పాల్గొని రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ చందు సుబ్బారావు, కళాశాల డైరెక్టర్‌ ఎస్‌.రాఘవరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
తెర్లాం: మండల కేంద్రంలోని మంగళవారం డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి విద్యాశాఖాధికారి త్రినాధరావు, ఎంపిడిఒ రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిఒ రాజ్యలక్ష్మి, సూపర్‌వైజర్లు, తెర్లాం పెరుమాలి కేంద్రాల్లో, గ్రంథాలయాల్లో నివాళులర్పించారు.
వేపాడ: బక్కునాయుడుపేట గ్రామం వద్ద గల డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం మొక్కలను నాటారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ, టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో సుమారు నాలుగు ఎకరాలలో 139 వివిధ రకాల పండ్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టిడిపి మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి, ఐటిడిపి మండల అధ్యక్షుడు సేనాపతి గణేష్‌, మండల మహిళా చైతన్య కమిటీ చైర్మన్‌ గొంప తులసి, పలువురు టిడిపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డెంకాడ: ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక ఎంఇఒ కార్యాలయంలో గత ఎంఇఒలను, ప్రస్తుత ఎంఇఒలను ఘనంగా సత్కరించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకున్న యు.ప్రమీలారాణి, యు.ఉమాదేవిలను కూడా సత్కరించారు. సుదీర్ఘ కాలం మండల విద్యా వనరుల కేంద్రంలో మెసెంజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన లెంక రామ్మూర్తిని సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విజయనగరంటౌన్‌: ఉపాధ్యాయ దినోత్సవం మంగళవారం పలు పాఠశాలలు, కళాశాలల్లో ఘనంగా జరిగింది. మంచి ఉపాధ్యాయుల కృషి వల్ల మంచి సమాజం తయారౌతుందని, అలాంటి ఉపాధ్యాయునికి మనము ఎప్పటికీ రుణపడి ఉంటామని గిరిజన యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కట్టిమని అన్నారు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణ చిత్ర పటానికి పులా మాలవేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణ ఉపాద్యాయులకే వన్నె తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి అని, అటువంటి మహనీయుని అడుగుజాడలలో నడవాల్సిన అవసరం నేటి ఉపాధ్యాయులకు ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో వర్శిటీ డీన్లు ప్రొఫెసర్‌ శ్రీనివాసన్‌ తంత్రవాహి, ప్రొఫెసర్‌ జితేంద్ర మోహన్‌ మిశ్రా, కంట్రోలర్‌ అఫ్‌ ఎక్సమినేషన్‌ ప్రొఫెసర్‌ కివడే తదితరులు మాట్లాడారు.
జెఎన్‌టియు గురజాడలో : జెఎన్‌టియు గురజాడలోఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె. వెంకట సుబ్బయ్య ముందుగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణ గారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ గొప్ప విద్యార్థులను తయారు చేసి దేశానికి దోహదపడేలా చేసే గొప్ప అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని, నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడం ఉపాధ్యాయులకు గొప్ప అవకాశమని అన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణ గారినీ ప్రతి ఉపాధ్యాయుడు ఆదర్శంగా తీసుకొని నేటి సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి. జయ సుమ, డైరెక్టర్లు,ప్రిన్సిపాల్‌, వివిధ విభాగాల హెడ్‌లు పాల్గొన్నారు.
స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సెంచూరియన్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి.ఎస్‌.ఎన్‌.రాజు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సమాజంలో ఉపాధ్యాయులకు ప్రముఖ స్థానం ఉందని, తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుకే ఉందని అన్నారు. విద్యార్థులు నిజాయితీ, జాతీయతా భావాన్ని మరియు సమయపాలనను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మజ్జి శశిభూషణ్‌ రావు మాట్లాడుతూ, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఎంతో మంది ఉపాధ్యాయులుకు ఆదర్శమని, వారిని ఉపాధ్యాయులంతా అనుసరించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డివి రామ మూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీ చైతన్య పాఠశాలలో: నేడు సమాజంలో ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకైనా ఉపాధ్యాయుడే మార్గదర్శి అని శ్రీచైతన్య పాఠశాల ప్రాంతీయ పర్యవేక్షకులు వి.శ్రీనివాసరావు అన్నారు. పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాల ద్వారా అందరినీ అలరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీధర్‌ బాబు, డీన్లు కె. సత్యనారాయణ, సాయి కిషోర్‌, సూర్య చంద్ర, ఎ. అప్పలనాయుడు, ప్రైమరీ ఇన్చార్జి పావని తదితరులు పాల్గొన్నారు.