ప్రజాశక్తి-విజయనగరం : అక్టోబర్ 31న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించను న్నట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఇఒ కె.ఎల్.సుధారాణి తెలిపారు. అక్టోబర్ 4న ఉదయం 11 గంటలకు పందిర రాట వేయడంతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో పైడితల్లి ఉత్సవ తేదీలను ఆమె ప్రకటించారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. అక్టోబర్ 30న తొలేళ్ల ఉత్సవం ఉంటుందని, మరుసటి రోజు అక్టోబర్ 31న అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం జరుగుతుందని వెల్లడించారు. నవంబర్ 7న పెద్దచెరువు వద్ద తెప్పోత్సవం, 14న ఉయ్యాల కంబాల ఉత్సవం ఉంటుందని వివరించారు.
అక్టోబర్ 4వ తేదీ ఉదయం 8.00 గంటలకు చదురుగుడి వద్ద మండల దీక్షలు, 25న అర్థమండలి దీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు వనం గుడి నుంచి కలశ జ్యోతి ఊరేగింపు ఉంటుందని వివరించారు. నవంబర్ 15న చండీహోమం, పూర్ణాహుతితో వనంగుడి వద్ద దీక్ష విరమణతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. సిరిమాను పూజారి బి.వెంకటరావు, వేదపండితులు రాజేశ్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణ, ఇతర ఏర్పాట్ల గురించి వివరాలు వెల్లడించారు. అనంతరం అందరూ కలిసి ఉత్సవ తేదీలతో కూడిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.
సమావేశంలో వేదపండితులు దూసి శివప్రసాద్, వి.నర్సింహమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పతివాడ వెంకటరావు, వెత్సా శ్రీనివాసరావు, గొర్లె ఉమ, ప్రత్యేక ఆహ్వానితులు ఎస్.అచ్చిరెడ్డి, గంధం లావణ్య, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.










