ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : గ్రూప్ 1లో విజయం సాధించి ఆర్టీఓగా ఎంపికైన గోపిశెట్టి మనోహర్ను పట్టణంలోని పలు ఆర్యవైశ్య సంఘాలు సన్మానించాయి. మంగళవారం స్థానిక శ్రీ పంచముఖాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ అమరజీవి ఫౌండేషన్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘాలు సంయుక్తంగా మనోహార్ను సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ అమరజీవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆలవెల్లి శేఖర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి విజయాలను సొంతం చేసుకోవాలని, జీవితంలో ఏదైనా సాధించి, మిగిలిన వారికి స్పూర్తిని కలిగించాలని అన్నారు. కార్యదర్శి సముద్రాల నాగరాజు, కోశాధికారి డిమ్స్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా సన్మానగ్రహీత మనోహర్ మాట్లాడుతూ.. మొదటిసారి సివిల్స్ వ్రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి తిరిగి వచ్చానని, దానికి కృంగిపోకుండా మరింత పట్టుదలతో చదివి నేడు విజయం సాధించానని అన్నారు. అవసరార్ధం ఏ విద్యార్థి అయినా ఫోన్ చేసి సబ్జెక్ట్ గురించి అడిగితే, చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. మనోహర్ తల్లిదండ్రులు గోపిశెట్టి నాగేశ్వరరావు,మంజుల బలభద్రుని నానాజీ, కుసుమంచి మహేష్,వెంకట్రావు,జి. నారాయణరావు,వంకాయల దాలయ్య శెట్టి, మాచర్ల చంద్రశేఖర్ గుప్త, జి.ఇందిరా తదితరులు పాల్గొన్నారు.










